
- రిలయన్స్ మార్కెట్ క్యాప్@రూ.20 లక్షల కోట్లు
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా మూడో సెషన్లోనూ ర్యాలీ చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ గురువారం ఒక శాతానికి పైగా పెరిగాయి. మార్కెట్ హెవీవెయిట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్లలో భారీ కొనుగోళ్లు, మిడిల్ఈస్ట్లో యుద్ధభయాలు తగ్గడంతో బుల్స్ హవా కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గడం, డాలర్బలహీనపడంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది.
30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 1,000.36 పాయింట్లు పెరిగి 83,755.87 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 1,056.58 పాయింట్లు పెరిగి 83,812.09 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 2,097 స్టాక్లు లాభపడగా, 1,900 నష్టపోయాయి. 50 షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 304.25 పాయింట్లు ర్యాలీ చేసి 25,549 వద్ద నిలిచింది. సెన్సెక్స్ స్టాక్స్లో టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, ఎటర్నల్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ, బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్ లాభపడ్డాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దాదాపు 2 శాతం పెరగడంతో దాని మార్కెట్ విలువ మళ్ళీ రూ. 20 లక్షల కోట్ల మార్కును దాటింది. అయితే ట్రెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెక్ మహీంద్రా, మారుతి మహీంద్రా అండ్ మహీంద్రా నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ గేజ్ 0.56 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.12 శాతం పెరిగింది.
మూడు రోజుల మార్కెట్ ర్యాలీతో పెట్టుబడిదారుల సంపద రూ.9.70 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈ -లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,57,52,700.57 కోట్లకు ( 5.34 ట్రిలియన్డాలర్లు) చేరుకుంది. ఈ మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,859.08 పాయింట్లు (2.27 శాతం) పెరిగింది.
సెక్టోరల్ ఇండెక్స్ల దూకుడు...
బీఎస్ఈ సెక్టోరల్ సూచీలలో, మెటల్ 2.28 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.88 శాతం, ఎనర్జీ 1.68 శాతం, కమోడిటీస్ 1.39 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.25 శాతం, యుటిలిటీస్ 1.24 శాతం, పవర్ 1.13 శాతం పెరిగాయి. ఐటీ, రియాల్టీ, బీఎస్ఈ ఫోకస్డ్ ఐటీ మాత్రమే వెనకబడ్డాయి.
ఆసియా మార్కెట్లలో, జపాన్ నిక్కీ 225 ఇండెక్స్ లాభపడి స్థిరపడగా, దక్షిణ కొరియా కోస్పి, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్ హాంకాంగ్ హాంగ్ సెంగ్ నష్టపోయాయి. మిడ్-సెషన్ డీల్స్లో యూరోపియన్ మార్కెట్లు గ్రీన్లో ట్రేడవుతున్నాయి.
యూఎస్ మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. యూఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి గురువారం 41 పైసలు పెరిగి 85.67 (తాత్కాలికం)కు చేరుకుంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ 0.18 శాతం పెరిగి బ్యారెల్ ధర 67.80 డాలర్లకు చేరుకుంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) బుధవారం రూ.2,427.74 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐలు) రూ.2,372.96 కోట్ల విలువైన స్టాక్లను కొనుగోలు చేశారు.