జగన్... అద్దం ముందు నిల్చొని ప్రశ్నించుకో - షర్మిల

జగన్... అద్దం ముందు నిల్చొని ప్రశ్నించుకో - షర్మిల

వైఎస్ వివేకానందరెడ్డి ఐదవ వర్థంతి సందర్బంగా కడపలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ సీఎం జగన్ పై ఘాటైన విమర్శలు చేశారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. అన్న అని పిలుచుకున్న వారే హంతకులను రక్షిస్తున్నారని అన్నారు. వివేకా మరణంతో అందరికంటే ఎక్కువ నష్టపోయింది సౌభాగ్యమ్మ, సునీతనే అని అన్నారు. హంతకులు ఎవరో కాదు, బంధువులే అని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయని అన్నారు. బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు.

ఇప్పటివరకు హత్య చేసిన, చేయించిన వాళ్లకు శిక్ష పడలేదని అన్నారు. చిన్నాన్న చివరి క్షణం వరకు వైసీపీ కోసమే పని చేశారని అన్నారు. సాక్షిలో పైన వైఎస్సార్ ఫోటో, కింద ఆయన తమ్ముడి వ్యక్తిత్వ హననం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగనన్నా ఒకసారి అద్దం ముందు నిలబడుకొని ప్రశ్నించుకో, నీ మనస్సాక్షి ఏం చెబుతుందో వినండని మండిపడ్డారు. తోబుట్టువుల కోసం రాజశేఖర రెడ్డి ఏం చేశారో తెలియదా, ఆయన వారసుడిగా మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు.