
కమర్షియాలిటీ కంటే వెర్సటాలిటీకి శర్వానంద్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. కొత్త దారిలో వెళ్లేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటాడు. అయితే కొంతకాలంగా తన ప్రయత్నాలు చేదు ఫలితాలనే ఇస్తున్నాయి. అయినా కూడా ‘ఒకే ఒక జీవితం’పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్లు, ట్రైలర్లు సినిమాపై క్యూరియాసిటీని పెంచడంతో ఈసారి శర్వా అకౌంట్లో మంచి హిట్ పడే అవకాశం ఉందన్నారంతా. మరి వారి మాటలు నిజమయ్యాయా? ఈ సినిమా ఆకట్టుకుందా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కథేమిటంటే..
ఆది (శర్వానంద్) చక్కగా పాడతాడు. పెద్ద సింగర్ అవ్వాలనుకుంటాడు. కానీ అందరి ముందూ పాడలేడు. స్టేజ్ ఎక్కితే చాలు.. కంగారుపడిపోతాడు. మాటిమాటికీ ఎమోషనల్ అయిపోతాడు. ఇరవయ్యేళ్ల క్రితం మరణించిన తల్లి (అమల) జ్ఞాపకాల నుంచి బయటపడలేక అవస్థ పడుతుంటాడు. అతని ఫ్రెండ్స్ చైతు (ప్రియదర్శి), శ్రీను (కిశోర్)లకి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. చైతుని చిన్నప్పుడు ఒకమ్మాయి ఇష్టపడుతుంది. కానీ అతను కాదంటాడు. తీరా పెద్దయ్యాక అతనికి ఏ అమ్మాయీ నచ్చదు. చిన్నప్పుడు ఆ అమ్మాయినే ప్రేమించి ఉంటే ఎంత బాగుండేది అని బెంగపడుతుంటాడు. ఇక శ్రీను రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఎక్కువ చదువుకోకపోవడం వల్ల ఇంగ్లిష్ రాదు. దాంతో చదువుకుని ఉంటే ఎంత బాగుండేదో కదా అని బాధపడిపోతుంటాడు. వీళ్లందరి లైఫ్లోకి సడెన్గా ఎంటరవుతాడు సైంటిస్ట్ పాల్ (నాజర్). ఆయన ఓ టైమ్ మెషీన్ని కనిపెడతాడు. దాని ద్వారా గతంలోకి వెళ్లి తమ తప్పుల్ని సరిదిద్దుకోవాలనుకుంటారు ఈ ముగ్గురు ఫ్రెండ్స్. అది సాధ్యపడిందా, గతంలోకి వెళ్లారా, వెళ్లి ఏం చేశారు అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే..
కొన్ని కథలు వినడానికి బాగుంటాయి. కానీ వాస్తవానికి దూరంగా ఉంటాయి. ఇలాంటి చోట లాజిక్ కంటే మ్యాజిక్ చాలా అవసరం. అప్పుడే ప్రేక్షకులు అతిగా ఆలోచించకుండా, నెగిటివ్ పాయింట్స్ కోసం వెతక్కుండా సినిమాలో ఇన్వాల్వ్ అవ్వగలరు. అలా అయ్యారు అంటే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ముఖ్యంగా ఇలాంటి టైమ్ ట్రావెల్ కథలు. ఇవి ఎప్పుడూ కాంప్లికేటెడ్గానే ఉంటాయి. అందుకే వాటిని డీల్ చేయడంలో చాలామంది డైరెక్టర్స్ ఫెయిలయ్యారు. ఈ సినిమా ఆ బ్యాక్డ్రాప్లో వస్తోందని తెలిసినప్పుడు రకరకాల సందేహాలు తలెత్తడానికి కారణం అదే. అప్పట్లో ఇదే జానర్లో వచ్చిన ‘ఆదిత్య 369’ బాగా ఎంటర్టైన్ చేయడంతో.. ఇది అలా చేయగలదా లేదా అనే డౌట్ ఏర్పడింది. దానికి సమాధానం ఇవాళ దొరికింది. ఇది టైమ్ మెషీన్ చుట్టూ తిరిగే కథే అయినా ‘ఆదిత్య 369’కి దీనికి పోలికలు లేవు. అదొక ఫన్ ఎంటర్టైనర్. ఇది ఎమోషనల్ డ్రామా. తల్లిని కోల్పోయిన ఓ పిల్లాడి బాధ.. ఆమెని మళ్లీ కలుసుకోవాలని ఆశపడటం.. కలుసుకుని గుండెల నిండా ధైర్యాన్ని నింపుకుని తిరిగి రావడం లాంటి అంశాలు మన గుండెని పట్టి పిండుతాయి. ఆ లైన్ తీసుకోవడమే దర్శకుడి మొదటి సక్సెస్.
ముగ్గురికీ సేమ్ ప్రయారిటీ ఇచ్చుంటే బాగుండేది...
దర్శకుడు వేసిన మరో తెలివైన అడుగు.. హీరో చుట్టూనే కథ తిప్పేయాలనుకోకుండా మరో రెండు సమానమైన పాత్రల్ని సృష్టించడం, వాటి కోసం వెన్నెల కిశోర్, ప్రియదర్శి లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టుల్ని ఎంచుకోవడం. వీళ్ల పాత్రల్ని డిజైన్ చేసిన తీరు, వారి చుట్టూ అల్లిన కథలు బాగున్నాయి. మూడు క్యారెక్టర్స్ మధ్య పుట్టే ఫన్ అలరించింది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా బాగుంది. ముప్ఫయ్యేళ్ల ప్రాయంలో ఉన్న కొందరు పదేళ్లప్పుడు తామెలా ఉన్నామో చూసుకోవాలని గతంలోకి వెళ్తారు. మళ్లీ ఆ పిల్లలు భవిష్యత్తులోకి దూకేయడం భలే అనిపిస్తుంది. ఇంతవరకు వచ్చిన టైమ్ మెషీన్ కథల్లో ఈ పాయింట్ ఎక్కడా కనిపించలేదు. ఇలాంటి ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ కొత్తగా అనిపించి థ్రిల్ చేశాయి. కానీ ఫస్టాఫ్లో ఉన్నంత థ్రిల్ సెకెండాఫ్లో లేదు. అక్కడ కథ కాస్త స్లో అయ్యింది. సీన్స్ కొంచెం డల్ అయ్యాయి. పైగా శర్వాపైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మిగతా పాత్రల ఎమోషన్ని అంతగా చూపించలేదు. అలా కాకుండా ఇక్కడ కూడా ముగ్గురికీ సేమ్ ప్రయారిటీ ఇచ్చి, అందరి బాల్యాన్నీ సమానంగా చూపించి ఉంటే బాగుండేది. సెంటిమెంటు ఇంకా బాగా పండేది. అయితే డిజప్పాయింట్ అయ్యేంత లోపాలేమీ కావివి. ఎందుకంటే అప్పటికే ప్రేక్షకులు ఓ బలమైన ఎమోషన్లో బందీలై ఉంటారు. మదర్ సెంటిమెంటుకు సంబంధించిన సన్నివేశాలకు కనెక్టయిపోతారు. అందుకే లాజిక్కులూ, చిన్న చిన్న లోపాలూ పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఉన్నది ఒక్కటే జీవితం.. దాన్నే అందంగా, తెలివిగా మలచుకోవాలని అనే సందేశం మనల్ని కన్విన్స్ చేస్తుంది.
ఎవరెలా..
శర్వానంద్ ఎంత మంచి నటుడో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కూల్గా, బరువుగా అనిపించే పాత్రలకు తను ప్రాణం పోస్తాడు. ఇది కూడా అలాంటి క్యారెక్టరే కావడంతో బెస్ట్ ఇచ్చాడు. అమ్మతో ముడిపడిన సన్నివేశాల్లో అతని నటన అద్భుతమనిపిస్తుంది. అమ్మ చేతి వంట మళ్లీ తింటున్నప్పుడు అతను ప్రదర్శించిన హావభావాల గురించి ఎంత చెప్పినా తక్కువే. నటుడిగా ఈ సినిమాతో మరికొన్ని మెట్లు ఎక్కేశాడు శర్వా. తల్లి పాత్ర కూడా బాగుంది. రెగ్యులర్గా అమ్మ పాత్రలు చేసేవాళ్లని కాకుండా అమలను తీసుకోవడం వల్ల కొత్తగా అనిపించింది. తను కూడా మంచి ఆర్టిస్ట్ కనుక పాత్ర చక్కగా పండింది. వెన్నెల కిశోర్ కామెడీ ట్రాక్ చాటా బాగుంది. సినిమాకి ప్లస్ అయ్యింది. ఎమోషనల్ డైలాగ్స్ చెప్పేటప్పుడు కూడా కిశోర్ తనదైన మార్క్ చూపించాడు. ప్రియదర్శి పాత్రని మరికొంత బాగా తీర్చిదిద్ది ఉండొచ్చు. తను కూడా సీరియస్ రోల్స్ బాగా చేస్తాడు. కాబట్టి కామెడీతో పాటు కాస్త ఎమోషన్ని కూడా జోడించి ఉంటే ఆ పాత్ర మరింత పండేది. రీతూవర్మ పాత్ర కూడా డిగ్నిఫైడ్గా బాగుంది. ఉన్నంతలో ఆమె బాగా చేసింది. ఇక నాజర్కి ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు. కాబట్టి అలవోకగా చేసుకుంటూ పోయారు.
ఇక టెక్నికల్ అంశాల సంగతి. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్లస్. డైలాగ్స్ బాగా పండాయి. కామెడీలో తనదైన మార్క్ చూపించిన తరుణ్ భాస్కర్.. ఎమోషనల్ సీన్స్ కి తన మాటలతో బలం చేకూర్చాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. బరువైన సన్నివేశాలకి తగినట్టుగా హృద్యమైన సంగీతాన్ని ఇచ్చాడు జేక్స్. అయితే హీరో సింగర్ కనుక కాస్త పాటల మీద కూడా దృష్టి పెడితే బాగుండేది. అందరి దగ్గరి నుంచీ తనకు కావాల్సింది రాబట్టుకున్న దర్శకుడు.. ప్రేక్షకులకు కావాల్సింది ఇవ్వడంలో తానూ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కన్ఫ్యూజ్ చేసే కాన్సెప్టే అయినా అతని రైటింగ్లో ఫుల్ క్లారిటీ ఉంది. ఏం చెప్పాలో తనకి తెలుసు. దేన్ని ఎంత చెప్పాలో కూడా తెలుసు. అందుకే టెక్నికల్గా వెళ్లకుండా అందరికీ అర్థమయ్యే రీతిలో కథ, కథనాలను తయారు చేసుకున్నాడు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలను మార్చి మార్చి చూపించినా ఎవ్వరూ కన్ఫ్యూజ్ కాకపోవడానికి కారణం అదే. పైగా అతను ఎమోషన్ను క్యారీ చేసిన విధానాన్ని మెచ్చుకుని తీరాలి. తల్లిని కోల్పోయిన ఎవ్వరైనా సరే.. ఈ సినిమా చూస్తే అమ్మకోసం కంటతడి పెట్టకుండా ఉండనంత గొప్పగా చూపించాడు. సైన్స్ గొప్పదని చెబుతూనే విధి రాతను మార్చలేమనే విషయాన్ని చక్కగా చెప్పాడు. మెదడును కాకుండా మనసు పెట్టి చూస్తే అతని ప్రయత్నం అందరికీ నచ్చే తీరుతుంది.
కొసమెరుపు: ఒకే ఒక జీవితం.. భావోద్వేగ భరితం
నటీనటులు: శర్వానంద్, రీతూవర్మ, అమల, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు
సంగీతం: జేక్స్ బిజోయ్
నిర్మాణం: ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు
మాటలు: తరుణ్ భాస్కర్
దర్శకత్వం: శ్రీ కార్తీక్