8న బీజేపీ దక్షిణాది నేతల మీటింగ్​.. ఏర్పాట్లపై పురందేశ్వరి రివ్యూ

8న బీజేపీ దక్షిణాది నేతల మీటింగ్​.. ఏర్పాట్లపై పురందేశ్వరి రివ్యూ

హైదరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసుకు వచ్చారు. హైదరాబాద్ లో వచ్చే నెల 8న దక్షిణాది రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల ( మొత్తం11 రాష్ట్రాల ) బీజేపీ అధ్యక్షులు, ఆయా రాష్ట్రాల పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశం జరగనుంది. ఈ మీటింగ్​ సమన్వయ బాధ్యతలను పార్టీ హైకమాండ్ పురందేశ్వరికి అప్పగించింది. దీంతో ఆమె ఈ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లపై తెలంగాణ బీజేపీ నేతలతో చర్చించారు. 

రాష్ట్ర పార్టీ తరఫున బీజేపీ ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి మీటింగ్ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించనున్నారు. దీంతో ఆమె మనోహర్ రెడ్డితో పాటు పార్టీ కోశాధికారి శాంతికుమార్, ఇతర నేతలతో సమావేశమయ్యారు. జూలై 7న సాయంత్రమే ఆయా రాష్ట్రాల అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులు హైదరాబాద్ కు చేరుకోనున్నారు. వారికి బస, వసతి, ఇతర సౌకర్యాల కల్పన, మీటింగ్ కు సంబంధించి వేదిక ఎక్కడ పెట్టాలి? ఎలాంటి ఏర్పాట్లు చేయాలి? తదితర అంశాలపై పురందేశ్వరి తెలంగాణ నేతలతో చర్చించారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ మీటింగ్ కు సంబంధించిన పూర్తి సమాచారం పార్టీ రాష్ట్ర నేతలు మీడియాకు వివరించనున్నారు.