ఖమ్మం జిల్లాలో ఘోరం.. అత్తను హత్య చేసిన అల్లుడు.. ప్రియురాలితో కలిసి ఘాతుకం

ఖమ్మం జిల్లాలో ఘోరం.. అత్తను హత్య చేసిన అల్లుడు.. ప్రియురాలితో కలిసి ఘాతుకం

సత్తుపల్లి, వెలుగు: అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని ప్రియురాలితో కలిసి అత్తను అల్లుడు హత్య చేశాడు. కల్లూరు ఇన్​చార్జి ఏసీపీ సాధుల సారంగపాణి, సీఐ శ్రీహరి ఆదివారం సత్తుపల్లి స్టేషన్​లో మీడియాకు వివరాలు వెల్లడించారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామానికి గుండాల వెంకట నరసమ్మ(65) తన కూతురు మంగమ్మను తాళ్లమడ గ్రామానికి చెందిన వెదుళ్ల తిరుపతి రావుకు ఇచ్చి రెండో పెళ్లి చేసింది.

ఎలక్ట్రిషియన్ గా పని చేస్తూ తిరుపతి రావు తుంబూరులో అత్త ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈక్రమంలో అదే గ్రామంలో భర్త చనిపోయి కూలీ పనులు చేసుకుంటున్న పగుట్ల సునీతతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై తిరుపతిరావుతో భార్య మంగమ్మ, అత్త వెంకటనరసమ్మ పలుమార్లు గొడవపడ్డారు. గత నెల 30న భార్య, అత్త కలిసి దుద్దేపూడి గ్రామంలో పని చేస్తున్న సునీత దగ్గరకు వెళ్లి తిరుపతిరావును వదిలి పెట్టాలని తిట్టడంతో పాటు కొట్టారు. 

దీంతో వెంకట నరసమ్మను అంతం చేయాలని ప్లాన్  చేశారు. ఈ నెల 2న తిరుపతిరావు, సునీత అర్ధరాత్రి 12 గంటల సమయంలో వెంకటనరసమ్మ ఇంటికి వెళ్లి టీవీ చూస్తుండగా, చీరతో గొంతు నులిమి హత్య చేశారు. డెడ్​బాడీని బైక్ పై పెట్టుకొని నారాయణపురం గ్రామ శివారుకు తీసుకెళ్లి కట్టెలు, కొబ్బరి మట్టలు, చెత్త వేసి కాల్చారు. శవం పూర్తిగా కాలలేదనే అనుమానంతో పెట్రోల్  తీసుకెళ్లి మళ్లీ మంట పెట్టారు. సర్పంచ్  వీరబాబు, జీపీవో లక్ష్మణ్ కు తాము వెంకట నరసమ్మను హత్య చేశామని చెప్పి పరారయ్యారు. పోలీసులు వారిని అరెస్ట్​ చేసి బైక్, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.