ఐసీసీ నెంబర్ 1 వన్డే బ్యాటర్గా శుభ్‌మన్ గిల్.. ఏకంగా 230 స్థానాలు జంప్ చేసిన వైభవ్

ఐసీసీ నెంబర్ 1 వన్డే బ్యాటర్గా శుభ్‌మన్ గిల్.. ఏకంగా 230 స్థానాలు జంప్ చేసిన వైభవ్

Shubman Gill: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (26) ప్రపంచ నంబర్- 1 బ్యాటర్‌గా నిలిచాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో గిల్ అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి వన్డేలో 80* పరుగులు, లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డేలో 77 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్‌ను వెనక్కి నెట్టి గిల్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 65 పరుగులు చేసిన మిచెల్, ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో కేవలం 28 రన్స్ కే పరిమితం కావడంతో రెండో స్థానానికి పడిపోయాడు. కాగా భారత సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు వరుసగా 3, 4 స్థానాల్లోనే కొనసాగుతున్నారు.

230 స్థానాలు జంప్ చేసిన వైభవ్ సూర్యవంశీ: 
టీ20 ర్యాంకింగ్స్‌లో భారత 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపాడు. జింబాబ్వే సిరీస్‌కు ముందు 278వ స్థానంలో నిలిచిన వైభవ్, ఏకంగా 230 స్థానాలు ఎగబాకి 48వ స్థానానికి చేరాడు. జింబాబ్వేతో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలతో ఏకంగా 151 రన్స్ చేసి తన సత్తా చాటడంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాన్ని దక్కించుకున్నాడు. 

టీ20ల్లో ఇషాన్ కిషన్ నెంబర్ వన్: 
టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తన నెంబర్-1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. జింబాబ్వే సిరీస్ తర్వాత ఆయన 910 రేటింగ్ పాయింట్లతో తన కెరీర్‌లోనే అత్యుత్తమ రేటింగ్‌ను నమోదు చేశాడు. ఇక జింబాబ్వేతో జరిగిన 3 మ్యాచ్‌ల్లోనూ నాటౌట్‌గా నిలిచి (రెండో టీ20లో 60 పరుగులు) అద్భుత ప్రదర్శన చేయడంతో 6వ స్థానానికి తిలక్ వర్మ చేరుకున్నాడు. అలాగే జింబాబ్వే సిరీస్‌లో నిరాశపరచడంతో నెంబర్ 1 ర్యాంక్ నుంచి 3వ స్థానానికి అభిషేక్ శర్మ పడిపోయాడు. కాగా పాకిస్తాన్‌కు చెందిన సాహిబ్‌జాదా ఫర్హాన్‌ ఒక్క మ్యాచ్ ఆడకుండానే 2వ స్థానానికి చేరుకున్నాడు. 

ALSO READ : భారత అసిస్టెంట్ కోచ్ రేసులో ముగ్గురు..

టీమ్‌గా భారత్ నెంబర్ వన్: 
గాయం కారణంగా జింబాబ్వే టీ20 సిరీస్‌ మొత్తానికి దూరమైన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానానికి పడిపోయాడు. ఇక జట్ల విషయానికి వస్తే, భారత పురుషుల క్రికెట్ జట్టు వన్డేలు, టీ20లు రెండింటిలోనూ ప్రపంచ నంబర్-1 జట్టుగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. జింబాబ్వేను క్లీన్ స్వీప్ చేయడంతో టీ20ల్లో భారత్ 268 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లాండ్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతుంది.