
నల్గొండ అర్బన్, వెలుగు : తమ భూమి ఆక్రమించారని, న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తే ఎస్సై రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేశారని కనగల్ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన బాధితులు గార్లపాటి భూపాల్ రెడ్డి, రామేశ్వరి ఆరోపించారు. పోలీస్ స్టేషన్లో ఎస్సైగా ఉన్నంతవరకు భూమి మీదికి ఎవర్నీ పోనివ్వనని ఎస్సై విష్ణుమూర్తి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నల్గొండలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
కనగల్ మండలం జి.చెన్నారం గ్రామంలో గతంలో కుకుట్ల శేఖర్ వద్ద సర్వే నంబర్ 70,71లో వ్యవసాయ భూమిని కొనుగోలు చేశామని, 2021లో ఆ భూమి పాస్ బుక్ కూడా పొందామని తెలిపారు. మండల, జిల్లా సర్వేయర్లు సర్వే చేసి హద్దులు చూపించడంతో పోలీసుల సమక్షంలో హద్దు రాళ్లు పాతి కంచె ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల పక్క భూమి యజమాని కంచర్లకుంట్ల వెంకట్ రామ్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు హద్దు రాళ్లు, కంచెను తొలగించారని చెప్పారు.
ఈ విషయంపై కనగల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఎస్సై మమ్ముల్నే బెదిరిస్తున్నారని వాపోయారు. రూ10 లక్షలు ఇస్తే భూ సమస్య పరిష్కారం చేస్తానని, లేకుంటే అసలు పరిష్కారం కాదని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ కు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. సివిల్ కేసుల్లో తల దూర్చిన కనగల్ ఎస్సై విష్ణు మూర్తిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.