సిద్దిపేట: తలకు రుమాలు, సాధారణ దుస్తుల్లో ఓ వ్యక్తి పాత బైకుపై సిద్దిపేటలో దూకుడుగా వెళ్తున్నాడు. 10 చోట్ల పోలీసు చెక్పోస్టులను దాటేశాడు. ‘ఎక్కడికి వెళ్తున్నావ్’ అంటూ పోలీసులు దబాయించగా మెకానిక్నని ఓ చోట.. మెడికల్ షాప్కి వెళ్తున్నానంటూ.. మరోచోట బదులిచ్చాడు. ‘మంత్రి నాకు తెలుసు..కావాలంటే పీఏకి ఫోన్ చేసి మాట్లాడమంటూ మరో చెక్పోస్టు వద్ద దర్పం ప్రదర్శిస్తే.. పోలీసులు నిరాకరించారు. ‘జ్వరం మాత్రలూ తెచ్చుకోనివ్వరా’ అని ఓ చోట ప్రశ్నిస్తే.. ఎస్ఐ స్థాయి అధికారి గర్జించాడు. ఇదంతా చదివి ఏమనుకుంటున్నారు? అత్యవసర పని ఉన్న ఆ వ్యక్తి ఏదోలా గమ్యం చేరడానికి పోలీసులకు సాకులు చెబుతున్నాడని అనుకుంటున్నారా..? అయితే తప్పులో కాలేసినట్లే.
సిద్దిపేటలో లాక్డౌన్ ఎలా అమలవుతోంది.. సాధారణ ప్రజల పట్ల పోలీసులు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవడానికి అదనపు ఎస్పీ రామేశ్వర్ ఇలా సాధారణ పౌరుడి అవతారమెత్తారు. ఒక్కడే పట్టణమంతా తిరిగి లాక్ డౌన్ ఎలా అమలు జరుగుతోందని తెలుసుకునేందుకు స్వయంగా మారు వేషంలో పర్యటించారు. పోలీసులు ఎలా డ్యూటీ చేస్తున్నారో గమనించేందుకు చివరకు తనను పోలీసులు సైతం గుర్తుపట్టకుండా ముఖానికి రుమాలు చుట్టుకుని పట్టణమంతా చక్కర్లు కొట్టి వచ్చారు. తిరుగు పయనంలో రుమాలు లేకుండా వచ్చిన ఆ అదనపు ఎస్పీని చూసి..ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. లాక్ డౌన్ అమలు తీరుపై అదనపు ఎస్పీ రామేశ్వర్ సంతృప్తి వ్యక్తం చేశారు.