కార్తీకంలో నదీస్నానం.. ఆధ్యాత్మికమే కాదు... ఆరోగ్యం కూడా

కార్తీకంలో నదీస్నానం.. ఆధ్యాత్మికమే కాదు... ఆరోగ్యం కూడా

పురాణాల ప్రకారం కార్తీకమాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెలలో  ఆచరించే నదీస్నానం ..  ప్రతి పూజ.. చేసే దానం.. ఎంతో విశిష్టమైన ఫలితాలు ఇస్తాయని పురాణాలద్వారా తెలుస్తోంది. కార్తీకంలో నదీస్నానం.. కేవలం ఆధ్యాత్మికమే కాదు... ఆరోగ్యం కూడాచేకూరుతుందని  అంటున్నారు. 

 కార్తీక మాసంలో నదీస్నానం.. దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఈ మాసంలో చేసే ప్రతి పూజ, దానం..  అత్యంత విశిష్టమైన ఫలితాలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కేవలం ఆధ్యాత్మికపరంగానే కాక.. దీని వెనక ఎంతో శాస్త్రీయ కోణం కూడా దాగి ఉంది. అందుకే పెద్దలు నెల రోజుల పాటు నియమంగా నదీ స్నానం చేయాలని సూచించారు.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

కార్తీక మాసం శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైనది. పురాణాల ప్రకారం.. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు నదులు, చెరువులలో నివసిస్తాడని విశ్వాసం. అందుకే కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం వలన సాక్షాత్తు శివకేశవుల అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.

కార్తీకమాసంలో  నదీస్నానం, దీపారాధన, కార్తీక పురాణం పఠించడం మోక్ష సాధనకు మార్గం ఏర్పరుస్తుందని పండితులు చెబుతున్నారు.  స్నానం చేసేటప్పుడు నీళ్లలో దైవశక్తిని ఆవాహన చేయాలి.

 స్నానం చేసేటప్పుడు చదవాల్సిన మంత్రం

 “గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు” 
అనే మంత్రాన్ని పఠించడం ద్వారా.. స్నానం చేసే నీటిలో సకల నదుల పవిత్రతను ఆవాహన చేస్తారు.

శాస్త్రీయ, ఆరోగ్య ప్రయోజనాలు

కార్తీక మాసంలో నదీ స్నానం చేయాలనే నియమం కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు.. ఆరోగ్యం కూడా చేకూరుతుంది.  ప్రకృతి నియమాల ప్రకారం కార్తీకం నుంచి చలి పెరుగుతుంది.  చలివలన అనేక చర్మ సమస్యలు వస్తాయి.  కార్తీకం ప్రారంభమయ్యే నాటికి వర్షాకాలం ముగిసి, నదులలోని వరదనీరు తగ్గి, నీరు స్వచ్ఛంగా మారుతుంది. రాళ్లు, వృక్షాలను తాకుతూ ప్రవహించే నది నీటిలో సహజంగానే ఖనిజాలు, మూలికల గుణాలు కలుస్తాయి. 

ముఖ్యంగా.. రాత్రంతా చంద్ర కిరణాల తాకిడికి గురైన ఈ నదీజలాలు మరింత ఔషధశక్తిని కలిగి ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఈ నీటిలో స్నానం చేయడం వలన శరీరం రుగ్మతల బారి నుంచి రక్షింపబడుతుంది.

 కార్తీక మాసంలో చలి కారణంగాబద్ధకం పెరుగుతుంది. ఉదయాన్నే చన్నీటి నదీ స్నానం చేయడం వలన శారీరక చురుకుదనం పెరుగుతుంది.  శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడి, రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు  ఉండేందుకు సహాయపడుతుంది. ఇది జీర్ణశక్తిని కూడా పెంపొందిస్తుంది.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. 

కార్తీక మాసంలో చంద్రుడు శక్తివంతంగా ఉంటాడు. నీటిపైనా, మానవుల మనస్సుపైనా చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రకిరణాలతో కూడిన నీటిలో స్నానం చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.

నదీ స్నానం వీలుకాని పక్షంలో.. ఇంట్లోనే స్నానం చేసే నీటిలో పై మంత్రాన్ని పఠిస్తూ నదీజలాలను ఆవాహన చేసుకొని స్నానం చేయవచ్చు. మొత్తంగా.. కార్తీక మాసపు నదీ స్నానం శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శుద్ధికి ఒక అద్భుతమైన మార్గంగా భావించవచ్చు. తెల్లవారుజామున   నదీ ప్రవాహంలో స్నానం చేసి, సూర్యోదయానికి ముందే శివారాధన చేయడం వల్ల గత జన్మలలో చేసిన పాపాలు తొలగిపోయి, అపారమైన పుణ్య ఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. .

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాలు... ఆధ్యాత్మిక నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు. మీకున్న  సమస్యలకు. వైద్య, ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.