సింగర్ మంగ్లీ వర్సెస్ అడ్వకేట్..పంజాగుట్ట పీఎస్ లో పరస్పర ఫిర్యాదులు

సింగర్ మంగ్లీ వర్సెస్ అడ్వకేట్..పంజాగుట్ట పీఎస్ లో పరస్పర ఫిర్యాదులు
  • పరస్పరం పోలీసులకు ఫిర్యాదు
  • రూ.కోట్ల మోసం చేసి, బెదిరిస్తున్నారని న్యాయవాది ఆరోపణ
  • బ్లాక్​మెయిల్ చేస్తున్నారంటూ మంగ్లీ ఫిర్యాదు

పంజాగుట్ట/గండిపేట, వెలుగు: ప్రముఖ సింగర్ మంగ్లీ (సత్యవతి), ఆమె సోదరుడు రమావత్ మధుపై పంజాగుట్ట పీఎస్​లో కేసు నమోదైంది. గోకులానందన ఇన్​ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఎగుమతి, దిగుమతి, రియల్ ఎస్టేట్, ట్రేడింగ్ వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇస్తామని నమ్మించి సుమారు150 మంది నుంచి రూ.10 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేశారని న్యాయవాది సింగపోగు సుబ్బారావుతో కలిసి పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

ఈ కేసును పరిశీలిస్తున్న క్రమంలో మంగ్లీ, ఆమె సోదరుడు తనను పంజాగుట్టలోని ఒక హోటల్​కు పిలిపించి, కేసు వదిలేయాలని డబ్బు ఆశ చూపారని.. తాను వినకపోవడంతో అంతు చూస్తామని ఫోన్ కాల్స్ ద్వారా బెదిరించారని న్యాయవాది సబ్బారావు శనివారం ఫిర్యాదు చేశారు. మరోవైపు, సదరు న్యాయవాదితోపాటు మరొకరు తనపై రూ.150 కోట్ల మోసం అంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మంగ్లీ నార్సింగి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఫోన్ చేసి తన ఇంటికి రావాలని ఒత్తిడి చేశారని, రాకపోతే సామాజికంగా అప్రతిష్ట పాలు చేస్తామని బెదిరిస్తూ, తనకు సంబంధం లేని కరెన్సీ నోట్ల వీడియోలతో తనను మానసిక వేదనకు గురిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఇరుపక్షాల ఫిర్యాదుల మేరకు పంజాగుట్ట, నార్సింగి పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.