టాలీవుడ్ సింగర్, బిగ్ బాస్ తెలుగు విజేత రాహుల్ సిప్లిగంజ్ చిక్కుల్లో పడ్డారు. విశాఖపట్నం ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో మోసం, బ్లాక్మెయిల్, బెదిరింపులు, వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా MVP కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు. రాహుల్ సిప్లిగంజ్తో పాటు పలువురి పేర్లను ఫిర్యాదులో ప్రస్తావించినట్లు సమాచారం.
రాహుల్ సిప్లిగంజ్ బావమరిది కర్వారపు రాహుల్ రెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని యువతి పేర్కొంది. తనతో సన్నిహితంగా మెలిగి, ఆ తర్వాత వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించింది. ఈ వ్యవహారంలో తనపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో తెలిపింది.
సెటిల్మెంట్ చేస్తామంటూ హైదరాబాద్కు పిలిపించిన సమయంలో రాహుల్ సిప్లిగంజ్ తనను చంపుతానని బెదిరించారని కూడా యువతి ఆరోపించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ప్రచారం చేసి పరువు, వ్యక్తిగత జీవితానికి నష్టం కలిగించారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్తో పాటు అడ్వకేట్ గీతా ప్రసన్న చందన, ఆమె భర్త శివ నారాయణ, నరేష్, ఉదయ్, సాయిరాంతోపాటు మరికొందరిపై కేసు నమోదైనట్లు సమాచారం.
ALSO READ : అమితాబ్ మెసేజ్ చేస్తే ప్రీతీ రిప్లై ఇవ్వలేదా?
మార్చి 10న తొలుత రాహుల్ రెడ్డిపై మాత్రమే ఫిర్యాదు చేసిన యువతి.. జూన్ 11న మరికొందరి పేర్లను చేర్చి మరో ఫిర్యాదు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం నిందితుల సంఖ్యపై భిన్నమైన వివరాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఫిర్యాదులోని ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసు దర్యాప్తు పూర్తయితే నిజానిజాలు తేలనున్నాయి.
