ఖమ్మం/ భద్రాద్రికొత్తగూడెం/ ములుగు, వెలుగు: ఖమ్మం జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్ 87.31 శాతం పూర్తయింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 12,43,781 మంది ఓటర్లు ఉండగా, ఆగస్టు 10 నాటికి 10,85,927 ఫారాలను ఆన్లైన్ చేశారు. 43,131 మంది మ్యాపింగ్ కానివారిగా, 33,380 మంది మృతులుగా గుర్తించారు. 1,01,549 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లగా, 1,57,854 ఫారాలు తిరిగి రాలేదు. పాలేరు 92.21 శాతంతో ముందుండగా, సత్తుపల్లి 91.81, వైరా 91.27, మధిర 90.87 శాతం నమోదు చేశాయి. ఖమ్మం నియోజకవర్గంలో 75.42 శాతం నమోదైనట్లు ఆఫీసర్లు తెలిపారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 9,96,198 మంది ఓటర్లకు గాను 1,32,785 మంది తగ్గారు. పినపాకలో 29,664, ఇల్లెందులో 33,351, కొత్తగూడెంలో 34,446, అశ్వారావుపేటలో 15,451, భద్రాచలంలో 19,873 మంది ఓటర్లు తగ్గినట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలో 31,187 మంది మృతులు, 78,253 మంది శాశ్వతంగా తరలివెళ్లినవారు, 14,305 మంది ఇప్పటికే ఎన్రోల్ అయినవారు, 8,733 మంది ఆబ్సెంట్గా గుర్తించారు. ములుగు నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తయిందని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. మొత్తం 2,36,970 మంది ఓటర్లలో 2,09,128 మంది ఫారాలను డిజిటలైజ్ చేయగా, 27,842 మందిని అన్కలెక్టబుల్గా గుర్తించారు. వీరిలో 8,354 మంది మృతులు, 4,015 మంది డబుల్ ఎంట్రీలు, 14,207 మంది శాశ్వతంగా తరలివెళ్లినవారు, 1,219 మంది ఆచూకీ లభించనివారు ఉన్నారు. డిజిటలైజేషన్ 88.25 శాతం, అన్కలెక్టబుల్ 11.75 శాతంగా ఉందని కలెక్టర్ వెల్లడించారు.
