వాట్సాప్‌‌కు పోటీగా దేశీ యాప్?

వాట్సాప్‌‌కు పోటీగా దేశీ యాప్?

న్యూఢిల్లీ: పాపులర్ ఆన్‌‌లైన్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్‌‌కు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వాలని చూస్తోందా? భారత్‌‌లో 341 మంది మిలియన్ల యూజర్లు ఉన్న వాట్సాప్‌‌కు పోటీగా స్వదేశీ చాటింగ్ యాప్‌‌ను రూపొందిస్తోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. ప్రభుత్వం వాట్సాప్‌ను పోలిన ఫీచర్లతో దేశీయంగా ఒక యాప్‌ను త్వరలోనే లాంచ్‌ చేయనుంది. సందేశ్‌ పేరుతో ఆవిష్కరించనున్న ఈ యాప్‌ టెస్టింగ్‌‌‌ను ఇప్పటికే షురూ చేసింది. దేశీ యాప్ అయిన సందేశ్‌‌ను పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులు వాడుతున్నారని సమాచారం.

జిమ్స్ (జీఐఎంఎస్‌) అనే పేరుతో ఈ యాప్‌ను కేంద్రం లాంచ్‌ చేయనుందని సమాచారం. దేశీయంగా ‘సందేశ్‌’ పేరుతో తీసుకురానుందని తెలుస్తోంది. వాట్సాప్ చాట్‌‌కు ఆల్టర్‌నేట్‌‌గా ఓ కొత్త యాప్‌‌ తయారీపై దృష్టి పెట్టామని భారత ప్రభుత్వం గతేడాది కన్ఫర్మ్ చేసింది. ఈ నేపథ్యంలో దీన్ని ఇప్పుడు వినియోగానికి రెడీగా ఉంచారని తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని మంత్రిత్వ శాఖల అధికారులు దీన్ని వాడుతున్నట్టు సమాచారం. అంతర్గత సమాచార మార్పిడి కోసం ఈ యాప్‌ను ఇప్పటికే కొంతమంది సర్కార్ అధికారులు సందేశ్‌ యాప్‌ను ఉపయోగిస్తున్నారని ఒక నివేదికలో బిజినెస్ స్టాండర్డ్ సోమవారం తెలిపింది. gims.gov.in పేజీని చూస్తే ఈ రిపోర్టులు నిజమేనేమోనని అనిపిస్తోంది.