మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం.. కొత్త ప్యానెల్ సస్పెండ్ పై సాక్షి మాలిక్

మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం..  కొత్త ప్యానెల్ సస్పెండ్ పై సాక్షి మాలిక్

కొత్తగా ఎన్నికైన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసిన తర్వాత భారత రెజ్లర్ సాక్షి మాలిక్ మొదటిసారి స్పందించారు. రెజ్లర్ల అభ్యున్నతి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది అక్కాచెల్లెళ్లు, ఆడబిడ్డల పోరాటమని చాలా కాలంగా చెబుతున్నామని, మంచి ఫెడరేషన్ గా వర్థిల్లాలంటే.. తమకు మహిళా అధ్యక్షురాలు రావాలని అన్నారు. అంతకుముందు WFI మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సహాయకుడు సంజయ్ సింగ్ బాడీకి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత సాక్షి ఇటీవల క్రీడ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.

ఇది మొదటి అడుగు అని, ఏదో మంచి జరుగుతుందని, ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నామని సాక్షి మాలిక్ చెప్పారు. ఫెడరేషన్ తదుపరి నిర్ణయాల తర్వాత తన రిటైర్మెంట్ పై నిర్ణయం చెబుతానని తెలిపారు.

డిసెంబర్ 21న సంజయ్ సింగ్ కొత్త డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత సాక్షి రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. 2016 ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాతో కలిసి విలేకరుల సమావేశంలో తన నిర్ణయాన్ని ధృవీకరించారు. మరో వైపు మరోవైపు సాక్షి మాలిక్‌కు మద్దతు ఇస్తూ బజరంగ్‌ పునియా పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కిచ్చేశాడు. అలాగే డెఫ్లింపిక్స్‌ విజేత వీరేందర్‌ సింగ్‌ యాదవ్‌ కూడా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించాడు. ఈ నిరసనల సెగ మధ్య నిబంధనలు అతిక్రమించారనే కారణంతో కొత్తగా ఎన్నికైన ప్యానెల్‌ను సస్పెండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.