ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి రెండేళ్ల జైలు శిక్ష

ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి రెండేళ్ల జైలు శిక్ష

ఢిల్లీలోని ఎయిమ్స్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడిచేసిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి ఢిల్లీ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినందుకు గాను ఆయన్ను దోషిగా నిర్ధారించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 9 సెప్టెంబరు 2016లో సోమనాథ్ భారతి, మరో 300 మంది కలిసి జేసీబీ ఆపరేటర్ సాయంతో ఎయిమ్స్ ప్రహరీకి ఉన్న ఫెన్సింగును తొలగించారు. ఈ క్రమంలో అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేసినట్టు ఎయిమ్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆర్ఎస్ రావత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాండే రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా వెంటనే బెయిలు కూడా మంజూరు చేశారు. అలాగే, ఇదే కేసులో సహ నిందితులైన జగత్ సైనీ, దిలీప్ ఝా, సందీప్ సోను, రాకేశ్ పాండేలపై తగిన సాక్ష్యాధారాలు లేనందున నిర్దోషులుగా ప్రకటించారు.