తల్లి మరణం తట్టుకోలేక.. కొడుకు మృతి

తల్లి మరణం తట్టుకోలేక.. కొడుకు మృతి

వెలుగు: తల్లి మరణవార్తను విని తట్టుకోలేక కుమారుడు చనిపోయిన ఘటన ఖమ్మం నగరంలోని చర్చి కంపౌండ్ లో జరిగింది. జిల్లా లోని తిరుమలాయపాలెం మండలం బీరోలుకు చెందిన దాశరథి లక్ష్మీనర్సమ్మ చాలా ఏళ్ల క్రితం కుటుంబంతో సహా వచ్చి చర్చి కంపౌండ్ లో స్థిరపడ్డారు. ఆమె 90 ఏళ్ల వయస్సులో అనారోగ్యానికి గురై శుక్రవారం రాత్రి 11:30 గంటల సమయంలో చనిపోయారు. చనిపోయే వరకు చివరి నిమిషాల్లో ఆమె కుమారుడు దాశరథి వేణునాథ స్వామి(63) తల్లికి సేవ చేస్తూనే ఉన్నారు. తల్లి మరణాన్ని తట్టుకోలేని ఆ కుమారుడి గుండె కొన్ని గంటల్లోనే ఆగిపోయింది.

శనివారం తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో వేణునాథస్వామి తల్లి మృతదేహం పక్కనే కన్ను మూశారు. ఈ విషయం తెలిసి ఇంటికి చేరుకున్న మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధించారు. కొన్ని గంటల సమయంలోనే ఇద్దరు చనిపోవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చాలా ఏళ్ల క్రితం టీచర్‍ గా పనిచేసిన శేషయ్య, లక్ష్మీనర్సమ్మ దంపతులకు పిల్లలు లేకపోవడంతో బంధువులబ్బాయి వేణునాథ స్వామిని ఐదేళ్ల వయస్సులో దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ తల్లిదండ్రులతోనే వేణు ఉంటున్నారు. ప్రభుత్వ టీచర్​గా పనిచేసిన వేణు ఐదేళ్ల క్రితం రిటైరయ్యారు. తండ్రి చాలా ఏళ్ల క్రితమే చనిపోవడంతో తల్లిని చూసుకుంటూ, దైవ సంబంధిత సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. తల్లిని అమితంగా ప్రేమించే వేణు.. చివరకు తల్లి మరణాన్ని తట్టుకోలేకపోయారు. వేణుకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.