V6 News

ఐటీ కారిడార్​లో స్పెషల్ బస్సులు

ఐటీ కారిడార్​లో స్పెషల్ బస్సులు

హైదరాబాద్, వెలుగు:  ఐటీ కారిడార్‌‌‌‌‌‌‌‌లో ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడవనున్నాయి. ఇందుకోసం మూడ్రోజుల కిందట ఆఫీసు స్పెషల్ బస్ సర్వీస్ సర్వేను చేపట్టింది.  అయితే  ఐటీ కంపెనీల రూట్లలో ఫుల్ ట్రాఫిక్​ ఉంటోంది. మెట్రో రైళ్లు కూడా కిటకిటలాడుతున్నాయి. అయితే లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేకపోవడం, సొంత వెహికల్స్ వాడకం పెరగడంతో ట్రాఫిక్ జామ్​తో జర్నీకి ఇబ్బందిగా మారుతోంది.  ఈ నేపథ్యంలో లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా స్పెషల్ బస్ సర్వీస్‌‌‌‌లను ఆర్టీసీ అందుబాటులోకి  తీసుకురానుంది. 

స్పెషల్ బస్సులు ... 

ఐటీ ఎంప్లాయీస్ చాలామంది మెట్రోలో వెళ్లేందుకు కూడా  ఇంటి  నుంచి వెహికల్స్​ తెచ్చి, స్టేషన్​ దగ్గర పార్క్ చేస్తున్నారు.  ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే టైమ్​లో  కూడా లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేక అవస్థలు పడాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులను గుర్తించిన టీఎస్‌‌‌‌ఆర్టీసీ ప్రత్యేక షటిల్ సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకుంది. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈ సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ షటిల్ సర్వీసుల అవసరం ఎంత ఉందో తెలుసుకునేందుకు ఆర్టీసీ ఒక ఆన్ లైన్ సర్వే నిర్వహిస్తోంది. ఇందులో ఎంప్లాయ్ పేరు, ఫోన్ నంబర్, కంపెనీ పేరు, పికప్, డ్రాపింగ్ ఏరియా, టైమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వీటిని ఆధారంగా తీసుకుని ఈ స్పెషల్ బస్సులను నడపనున్నారు. 

యాప్​లో టికెట్ బుకింగ్

ఈ షటిల్ బస్సు సర్వీసులను ఉపయోగించుకునేందుకు వీలుగా  ప్రత్యేక యాప్ ఆర్టీసీ తీసుకురానుంది. ఈ యాప్‌‌‌‌లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. దీంతో పాటు బస్‌‌‌‌ ఎక్కడ ఉందనే వివరాలను ట్రాకింగ్ ద్వారా తెలుసుకునే వీలుంది.   మహిళల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని ఈ ట్రాకింగ్ ఫెసిలిటీని కల్పిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ఈ యాప్‌‌‌‌లో బస్‌‌‌‌ సర్వీస్ నంబర్, డ్రైవర్, కండక్టర్ ఫోన్ నంబర్లు ఉంటాయి. 

అవగాహన కల్పిస్తూ..

టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో  ఎంప్లాయీస్​కు ఆయా కంపెనీలు అవగాహన కల్పిస్తున్నాయి. తెలంగాణా ఫెసిలిటీస్ మేనేజ్​మెంట్ కౌన్సిల్ (టీఎఫ్ఎంసీ) ఈ ప్రపోజల్ పై ఆర్గనైజేషన్లకు సర్వే ఫామ్​ను పంపిస్తున్నాయి.  ఇందుకోసం పలు క్యాంపెయినింగ్ కూడా చేయనున్నట్లు టీఎఫ్‌‌‌‌ఎంసీ అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు.  ఈ సేవలపై టీఎస్‌‌‌‌ఆర్టీసీ ఎండి సజ్జనార్​తో సమావేశం కానున్నట్లు తెలిపారు. 

 ఎంతో ఉపయోగం.. 

ప్రస్తుతం 2 వేలకు ఐటీ కంపెనీలు నడుస్తున్నాయి. ఎంతోమంది ఎంప్లాయీస్​ హైబ్రిడ్ మోడ్‌‌‌‌లో పని చేస్తున్నారు.  ఆర్టీసీ  స్పెషల్ బస్సులు ఐటీ ఎంప్లాయీస్​కు ఎంతో ఉపయోగపడతాయి. వీటిపై  అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరు సర్వేలో పాల్గొనేలా చూస్తున్నాం. 
- సత్యనారాయణ, అధ్యక్షుడు, టీఎఫ్‌‌‌‌ఎంసీ

ట్రాఫిక్ సమస్య లేకుండా.. 

సర్వే ద్వారా బస్సు సర్వీసుల గురించి తెలుసుకున్నాం. ఎప్పుడు స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తున్నాం. అయితే ఈ సర్వీస్‌‌‌‌లు ఎలా ఉంటాయి? బస్ నంబర్ ఇస్తారా? ఇలా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎంప్లాయీస్​కు స్పెషల్ బస్సుల ఏర్పాటు ఆలోచన బాగుంది. - ప్రసాద్, ఐటీ ఎంప్లాయ్, ఇన్ఫోసిస్