ఎల్వోసీ వద్ద స్పెషల్ స్నైపర్స్

ఎల్వోసీ వద్ద స్పెషల్ స్నైపర్స్

జమ్మూకాశ్మీర్‌‌లో ఎండల తీవ్రత తగ్గుతోంది. వాతావరణం చల్లబడుతోంది. సరిగ్గా రెండు నెలలు దాటితే నియంత్రణ రేఖ(ఎల్వోసీ) ఆవల పొగ మంచు వస్తుంది. ఇండియాలో కల్లోలం సృష్టించడానికి, ఆయుధం పట్టిన టెర్రరిస్టులు అప్పుడు బయల్దేరుతారు. భూలోక స్వర్గం లాంటి ఆ నేలను రక్తంతో తడపాలని తహతహలాడుతుంటారు. ఇక అలాంటివాళ్లు ఇండియాలోకి చొరబడలేరు.

ఇండియన్ ఆర్మీలోని అత్యుత్తమ స్నైపర్లు.. ఎల్వోసీకి కిలోమీటరు దూరంలో ఉండగానే వాళ్లను లేపేస్తారు. ఇప్పటికే ఈ దళాలు ఎల్వోసీని తమ చేతుల్లోకి తీసుకున్నాయి. వాళ్లకు అత్యంత ఆధునికమైన బారెట్టా. 338, లపువా మాగ్నమ్ స్కార్పియో టీజీటీ, బారెట్ ఎం95 రైఫిళ్లను ఆర్మీ ఇచ్చింది. కొద్ది నెలలుగా అమెరికా, ఇటలీకి చెందిన నిపుణులతో స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇప్పించింది. ఈసారి ‘చొరబాటు’ కాలంలో టెర్రరిస్టుల భరతం పట్టేందుకు వ్యూహాలనూ సిద్ధం చేసింది.

బారెట్ ఎం95 ఓ యాంటీ మెటీరియల్ రైఫిల్. దీని రేంజ్ 1.8 కిలోమీటర్లు. దీని 0.50ఎంఎం బుల్లెట్లు మెటల్‌‌ను సైతం చీల్చుకుని వెళ్తాయి. బుల్లెట్లు లేకుండా దాదాపు 10 కిలోల బరువుంటుంది. లపువా మాగ్నమ్ స్కార్పియో టీజీటీ రైఫిళ్లను ఇటాలియన్ కంపెనీ బారెట్టా తయారు చేసింది. వీటిని అఫ్గానిస్థాన్, ఇరాక్ యుద్ధాల్లో వాడారు. ఈ రైఫిళ్లలో ఉన్న మరో సదుపాయం ఒక్క క్యాట్రిడ్జిలో ఎక్కువ బుల్లెట్లు ఉంటాయి. దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను ఈజీగా నేల కూల్చగల సత్తా వీటికి ఉంది.