
- ధర్మదర్శనానికి 2 గంటలు, స్పెషల్ దర్శనానికి అరగంట
- ఆదివారం ఒక్కరోజే రూ.51.93 లక్షల ఆదాయం
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి రెండు గంటలు, స్పెషల్ దర్శనానికి అరగంట సమయం పట్టింది. ఆలయంలో నిర్వహించిన నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు ఆలయంలో నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి.
ఆదివారం భక్తులు జరిపించిన నిత్య పూజలు, కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.51,93,737 ఆదాయం వచ్చింది. ఇందులో ప్రసాద విక్రయం ద్వారా రూ.20,66,440, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.5.39 లక్షలు, వీఐపీ దర్శనాల ద్వారా రూ.11.10 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.4,80,300 ఆదాయం వచ్చినట్లు భక్తులు తెలిపారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి యోగితా రాణా దర్శించుకున్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి గుట్టకు వచ్చిన యోగితారాణకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేదాశీర్వచనం చేయగా.. ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్ లడ్డూప్రసాదం, స్వామివారి శేష వస్త్రాలు అందజేశారు.