అన్ని సబ్జెక్టుల్లో 35/100

అన్ని సబ్జెక్టుల్లో 35/100

యావరేజ్‌ స్టూడెంట్‌కు టెన్త్‌ క్లాస్‌ గట్టెక్కడం కాస్త కష్టమే. సాధారణంగా ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌ తెగ ఇబ్బంది పెడుతుంటాయి. చాలా మంది 35, 36 మార్కులతో బయటపడిపోతుంటారు. ఇలా ఒకట్రెండు సబ్జెక్టుల్లో 35 మార్కులతో పాసైపోవడం మామూలే. కానీ అన్ని సబ్జెక్టుల్లో ఇలాగే జరిగితే.. జరిగితే ఏంటి జరిగింది కూడా. ముంబైకి చెందిన అక్షిత్ జాదవ్ టెన్త్‌ క్లాస్‌ ఎగ్జామ్స్‌ రాశాడు. శనివారం రిజల్ట్స్‌ వచ్చాయి. ఆత్రంగా రిజల్ట్‌ చూసుకున్న జాదవ్‌ షాకైపోయాడు. చిత్రంగా తనకు అన్ని సబ్జెక్టుల్లోనూ జస్ట్‌ పాస్‌ మార్కులు 35 మాత్రమే వచ్చాయి.

జాదవ్‌ మార్కుల లిస్ట్‌ చూసినోళ్లంతా ఇలా ఎలా వచ్చాయంటూ ఆశ్చర్యపడిపోతున్నారు. విషయం తెలిసి ముంబై మీడియా మొత్తం జాదవ్‌ కోసం వెతుకులాట మొదలెట్టి చివరకు దొరకబుచ్చుకుని ఇంటర్వ్యూలు చేస్తోంది. మొత్తంగా రిజల్ట్‌ డే నాడు జావెద్‌ సెలబ్రెటీ అయిపోయాడు. ‘మా వాడి మార్కులు చూసి ఆశ్చర్యపోయా. కనీసం 55% మార్కులు వస్తాయనుకుంటే అన్నింట్లోనూ 35 మార్కులే వచ్చాయి. అయితే అన్ని సబ్జెక్టుల్లో పాస్‌ కావడం సంతోషంగా ఉంది’ అన్నారు జాదవ్‌ తండ్రి గణేశ్‌. ఇక వైరల్‌ అవుతున్న ఈ మార్కుల లిస్ట్‌పై సోషల్‌ మీడియాలో జోకులే జోకులు.