
ఇబ్రహీంపట్నం, వెలుగు: రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి రంగారెడ్డి జిల్లా యాచారం మండలకేంద్రంలో మోడల్మార్కెట్నిర్మాణ స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మండలంలోని గడ్డమల్లయ్యగూడ, చౌదర్ పల్లి, మొండి గౌరెల్లి గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేస్తున్న కూరగాయల సాగుపై రైతులతో చర్చించారు.
యాచారం మండలంలో మూడు గ్రామాల్ని పైలట్ గా తీసుకొని ఉద్యానవన పంటల సాగు చేస్తున్నట్లు వివరించారు. సీఎం రేవంత్రెడ్డి యాచారంను ఫోర్త్ సిటీ గా డెవలప్ చేస్తున్నారని చెప్పారు. తన చిన్నాన్న మల్లారెడ్డికి చెందిన 2 వేల గజాలకు పైగా సొంత స్థలాన్ని గతంలో గ్రామ రైతుల కోసం ప్రభుత్వానికి అప్పగించామని, ఆ స్థలంలో నిర్మించిన భవనాన్ని వ్యవసాయ శాఖకు కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భవానీరెడ్డి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి.గోపి, కమిషన్ మెంబర్ సెక్రటరీ గోవిందు, మార్కెటింగ్ శాఖ అడిషనల్ డైరెక్టర్ రవికుమార్, అగ్రికల్చర్ అధికారి హరివెంకటప్రసాద్ పాల్గొన్నారు.