
ఒకవైపు నిరుడు మార్క్ఫెడ్ కొనుగోలు చేసిన కందులు ఇంకా గోదాముల్లో మూలుగుతూనే ఉన్నాయి. మరోవైపు కొత్త కందులు మార్కెట్కు పోటెత్తుతున్నాయి. పాతవాటిని ట్రేడర్లకు అమ్మేసేందుకు, కొత్తవాటిని రైతుల నుంచి కొనేందుకు మార్క్ఫెడ్కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావడం లేదు. ఫలితంగా సుమారు 24వేల టన్నుల పాత స్టాక్ గోదాముల్లో మూలుగుతుంటే.. కొత్త కందులను ఎక్కడ అమ్మాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈసారి తన వాటాగా 47,500 టన్నుల కందులను కొన్నది. ఇంకా సుమారు లక్షన్నర టన్నులు రైతుల దగ్గర ఉన్నాయి.
తక్కువకు కోట్ చేస్తున్న ట్రేడర్లు
గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరఫున మార్క్ఫెడ్ సుమారు 24వేల టన్నుల కందులు కొనుగోలు చేసింది. వాటిని టెండర్ల ద్వారా అమ్మాలని మార్క్ ఫెడ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఐదునెలల క్రితం సుమారు వెయ్యి క్వింటాళ్ల అమ్మకానికి అధికారులు టెండర్లు పిలువగా.. ట్రేడర్లు, మిల్లర్లు క్వింటాల్కు రూ.4,200 వరకు కోట్ చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మార్క్ఫెడ్ తీసుకెళ్లగా అనుమతి లభించలేదు. ట్రేడర్లు కోట్ చేసిన ప్రకారం కందులను అమ్మితే క్వింటాల్కు రూ. 2,800చొప్పున నష్టం వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గతేడాది మార్క్ఫెడ్ రైతుల నుంచి క్వింటాల్కు రూ.5,675 చొప్పున వీటిని కొన్నది. మార్కెట్ల నుంచి తరలింపు, బస్తాలు ఇతరాత్ర ఖర్చులన్నీ కలిపి క్వింటాల్కు రూ.7,000 వరకు ఖర్చు అయింది. 24వేల టన్నుల కందుల కొనుగోలు కోసం దాదాపు రూ.200 కోట్లు బ్యాంకుల్లో మార్క్ఫెడ్ అప్పులు చేసింది. పాత కందులు గోదాముల్లోనే పడి ఉండటంతో అవి పుచ్చిపోయే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు.