హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రిటైర్ అవుతున్న అధికారులను సలహాదారులుగా నియమించడాన్ని ఆపాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్జీజీ) సెక్రటరీ పద్మనాభరెడ్డి కోరారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారికి శుక్రవారం లేఖ రాశారు. రిటైర్ అయిన ఐఏఎస్, ఐపీఎస్ లను సలహాదారులుగా నియమిస్తున్నారని, మరి కొంత మంది రిటైర్ అయిన చీఫ్ ఇంజనీర్లను ఈఎన్సీలుగా, ఇంకొంత మందిని ఆయా శాఖల్లో కన్సల్టెంట్లుగా నియమిస్తూ, ఓఎస్డీలుగా ఎక్స్టెన్షన్ ఇస్తున్నారని విమర్శించారు.
కొంత మంది సలహాదారులకు కేబినెట్ హోదా సైతం ఇచ్చారని చెప్పారు. ఇకనైనా ఇలాంటి నియామకాలు, ఎక్స్ టెన్షన్లు ఆపాలని ఆయన కోరారు. ఈడీ డైరెక్టర్కు మూడోసారి ఎక్స్ టెన్షన్ ఇస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయాన్ని లేఖలో గుర్తుచేశారు. రిటైర్ అయిన వారిని కొనసాగిస్తే ప్రభుత్వ అధినేతలకు అనుకూలంగా పనిచేస్తారని పద్మనాభరెడ్డి ఆరోపించారు.