ఈసారి మస్తు వానలు..కాలం మంచిగైతదన్న వాతావరణ శాఖ

ఈసారి మస్తు వానలు..కాలం మంచిగైతదన్న వాతావరణ శాఖ
  • పునాస పంటలకు రెడీ అవుతున్న రైతులు
  • మూడు రోజుల ముందుగానే అండమాన్​కు నైరుతి రుతుపవనాలు 
  • ఈ నెలాఖరు కల్లా కేరళకు.. జూన్​ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి
  • సాధారణం కన్నా ఎక్కువగా వర్షాలు పడే అవకాశం
  • కోటీ 34 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని సర్కార్​ అంచనా

హైదరాబాద్​, వెలుగు : ఈసారి కాలం మంచిగైతదని వాతావరణ శాఖ చల్లటి ముచ్చట చెప్పింది. ఎల్​నినోతో నిరుడు కరువు పరిస్థితులు ఉండగా.. ఈయేడు లానినా ప్రభావంతో  మస్తు వానలు పడ్తాయని అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు ముందుగానే ఎంటరయ్యాయి. ఆదివారం అండమాన్​ నికోబార్​ దీవుల్లోకి ప్రవేశించాయి. దక్షిణ బంగాళాఖాతంలోకి కొంత మేర విస్తరించాయి.

మరో వారం, పది రోజుల్లో కేరళ తీరాన్ని తాకి.. తర్వాత వారం రోజులకు అంటే జూన్​ మొదటివారంలోనే మన రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు పునాస పంటలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దుక్కులు దున్నుకుంటున్నారు.   

రుతుపవనాలకు అనుకూల వాతావరణం

వాస్తవానికి ఏటా మే 22న అండమాన్​లోకి రుతు పవనాలు ప్రవేశిస్తాయి. దాని ప్రకారమే వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంటుంది. మన రాష్ట్రంలోకి జూన్​ రెండో వారంలో ప్రవేశిస్తుంటాయి. అయితే, ఈసారి మాత్రం మూడు రోజుల ముందుగానే అండమాన్​ తీరంలోకి రుతుపవనాలు వచ్చాయి. దానికి కారణాలూ లేకపోలేదు.

గత ఏడాదంతా ఎల్​నినో ప్రభావంతో పసిఫిక్​ మహా సముద్రంపై ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి ఎల్​నినో పరిస్థితులు తగ్గుముఖం పట్టి.. లానినా ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు వచ్చాయి. మే నెల మధ్య నాటికి ఎల్​నినో పూర్తిగా వెళ్లిపోతుందన్న నేషనల్​ ఓషియానిక్​ అట్మాస్ఫెరిక్​ ఏజెన్సీ (ఎన్​వోఏఏ), ఐఎండీ అంచనాలు నిజమయ్యాయి. ఇటు హిందూ మహాసముద్రంలోనూ వాతావరణం పాజిటివ్​గా మారి..

రుతుపవనాలు ముందుకు జరగడానికి దోహదపడింది. పశ్చిమగాలుల దిశ సరిగ్గా ఉండడం.. వాటి వేగం కూడా పెరగడం, బంగాళాఖాతంలో మేఘాలు ఏర్పడడం వంటి కారణాలు కూడా నైరుతి రుతుపవనాలు ఈసారి వేగంగా అండమాన్​లోకి ప్రవేశించేందుకు దోహదపడ్డాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.

మరో వారం పదిరోజుల పాటు సముద్రంలో ఇదే పరిస్థితి ఉండే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో కేరళను ఈ నెల 31న రుతుపవనాలు తాకితే.. మన రాష్ట్రంలోకి జూన్​ 10లోపే వచ్చేస్తాయని పేర్కొంటున్నారు. 

సాధారణం కన్నా ఎక్కువే..!

మే నెలలో రెండు వారాలు దాటిందంటే చాలు టెంపరేచర్లు విపరీతంగా పెరుగుతుంటాయి. కానీ, ఈ ఏడాది మాత్రం వరుసగా వర్షాలు పడుతున్నాయి. దానికి కారణం లానినా ప్రభావమేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. లానినా ప్రభావంతోనే వరుసగా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు ఏర్పడుతున్నాయని.. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదే క్రమంలో తొలి అంచనాల్లో భాగంగా గత నెలలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసిన అధికారులు.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

కోటీ 34 లక్షల ఎకరాల్లో సాగు

నిరుడు పునాస (వానాకాలం) సీజన్​ సరిగ్గా కాలేదు. రుతుపవనాలు జూన్​ మూడో వారం మధ్యలో ఎంటరయ్యాయి. వానల్లేక రైతులు త్వరగా పొలం పనులను మొదలు పెట్టలేదు. కానీ, ఇప్పుడు రైతులు వరుస వానలు, వాతావరణ శాఖ అంచనాలను చూసి ముందుగానే దుక్కులను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే నిజామాబాద్​, ఖమ్మం, కరీంనగర్​తో పాటు పలు జిల్లాల్లో దుక్కులు దున్నుకుంటున్నారు. వ్యవసాయ శాఖ కూడా అందుకు తగ్గట్టు సిద్ధమవుతున్నది. విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా యాక్షన్​ ప్లాన్​ రెడీ చేస్తున్నది. 

ఈ వానాకాలం సీజన్​లో దాదాపు 1,34,35,175 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. వరి 66 లక్షలు, పత్తి 60 లక్షల ఎకరాల్లో సాగవుతుందని లెక్కగట్టారు. మక్కలు 6 లక్షలు, కందులు 5.65 లక్షలు, సోయాబీన్​ 5 లక్షల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. జొన్నలు, రాగులు, వేరుసెనగ, పెసలు, మినుముల సాగు కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులకు టైంకు విత్తనాలు అందించేలా చర్యలు చేపడుతున్నారు. 

ప్రాజెక్టులకూ వరద!

సాగునీటి ప్రాజెక్టులకు కూడా ఈసారి వరదలు బాగానే ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నిరుడు క్యాచ్​మెంట్​ ఏరియాల్లో వానల్లేక ప్రాజెక్టులకు వరదలు రాలేదు. వచ్చిన కొద్దిపాటి వరద కాస్తా కర్నాటకలోని ప్రాజెక్టులు నిండడానికి కూడా సరిపోలేదు. దీంతో మన రాష్ట్రంలోని కృష్ణా బేసిన్​లోని ప్రధాన ప్రాజెక్టులైన నాగార్జునసాగర్​, శ్రీశైలం ప్రాజెక్టులు గత పదేండ్లలో ఎన్నడూ లేనంతగా డెడ్​ స్టోరేజీకి చేరాయి. ఈ సారి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆ పరిస్థితి ఉండదన్న ఆశాభావం వ్యక్తమవుతున్నది.