- పెల్లెట్ గాయాలు తగిలిన స్టూడెంట్తో కలిసి మీడియా ముందుకు
- పెల్లెట్లు గుచ్చుకోవడంతో సాహిల్ కుడి కన్ను చూపు పోయింది
- విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటరా?
- ప్రధాని క్షమాపణ చెప్పాలి.. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే
- అప్పటివరకూ ప్రభుత్వంతో చర్చలు లేవని వెల్లడి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇకనైనా అబద్ధాలు చెప్పడం మానుకోవాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ‘చలో పార్లమెంట్’ చేపట్టిన ఆందోళనకారులపై పోలీసులు పెల్లెట్ గన్లతో కాల్పులు జరుపుతారా? అంటూ మండిపడ్డారు. పైగా కాల్పులు జరగలేదంటూ అబద్ధాలు ఆడుతారా?.. ఇదిగో సాక్ష్యం అంటూ పెల్లెట్లు తగిలి గాయపడిన సాహిల్ అనే బాధితుడిని పక్కన పెట్టుకొని శుక్రవారం ఢిల్లీలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.
నజఫ్గఢ్కు చెందిన 19 ఏండ్ల ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి, బాధితుడు సాహిల్ లోచ్హబ్ను రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో పరిచయం చేశారు. ‘‘దేశభక్తితో జాతీయ జెండా పట్టుకుని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఒక కుర్రాడిపైకి పెల్లెట్లతో కాల్పులు జరిపారు. అవి గుచ్చుకోవడంతో సాహిల్ కుడికన్ను చూపు కోల్పోయాడు. మళ్లీ చూపు వస్తుందో లేదో తెలియని పరిస్థితి. దేశ భవిష్యత్తు అయిన యువతపైకే నేరుగా తుపాకులు ఎక్కుపెట్టారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసు ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా కష్టపడుతున్న సాహిల్.. తండ్రికి తోడుగా డ్రైవర్గా పనిచేస్తూ చదువుకుంటున్నాడని పేర్కొన్నారు.
ప్రధాని క్షమాపణ చెప్పాలి
సాహిల్లాంటి యువతకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ‘‘శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వేలాది మంది విద్యార్థులపై లాఠీఛార్జీలు చేసి, దాడులు చేశారు. పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అడగడమే వీరు చేసిన నేరమా? మన దేశ భవిష్యత్తుపై లాఠీలు, తుపాకులు వాడిన అధికారులు, పాలకులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని అన్నారు.
ఈ విద్యా వ్యవస్థ నాశనానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానే ప్రధాన బాధ్యుడని, ఆయనొక ‘నేరపూరిత విద్యాశాఖ మంత్రి’ అని మండిపడ్డారు. ఆయన తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
స్టూడెంట్ల గొంతు నొక్కుతారా.. మీకెంత ధైర్యం?
స్టూడెంట్ల నిరసనలపై ఆంక్షలు విధించిన దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల తీరుపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేలా ‘నో ప్రొటెస్ట్’ అడ్వైజరీలు జారీ చేస్తారా? అని ఫైర్ అయ్యారు. ‘‘తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకుంటున్న విద్యార్థులను బెదిరించడానికి మీకు ఎంత ధైర్యం? సరైన సమయం వచ్చినప్పుడు ఈ నిర్ణయాలు తీసుకున్న వారిని కచ్చితంగా జవాబుదారీగా చేస్తాం.. బాధ్యులైన వారిపై చర్యలు తప్పవు!” అని ‘ఎక్స్’ వేదికగా హెచ్చరించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జంతర్ మంతర్ వద్ద జరిగే చట్టవిరుద్ధమైన సమావేశాలు, ధర్నాలకు దూరంగా ఉండాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ వర్సిటీ, జేఎన్యూ, ఐఐటీ రూర్కీ లాంటి ప్రముఖ విద్యాసంస్థలు అడ్వైజరీలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో రాహుల్గాంధీ ఆయా వర్సిటీలనుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వన్సైడ్ మన్కీ బాత్లు వద్దు..
పేపర్ లీకేజీల వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అర్ధరాత్రి విడుదల చేసిన వీడియో సందేశంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ సభా వేదికగా ప్రకటన చేయకుండా బయట ‘ఏకపక్ష మన్ కీ బాత్’ చెప్పడమేంటని మండిపడింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని, నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ ప్రధాని క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు.
పేపర్ లీకేజీలను అరికట్టేందుకు వచ్చేవారం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతామని ప్రధాని ప్రకటించినప్పటికీ, నీట్-యూజి, యూజీసీ -నెట్ పరీక్షల లీకేజీలపై మోదీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడుతూ నిజాలను తొక్కిపెట్టే ప్రయత్నం చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు.
అప్పటివరకూ చర్చల్లేవ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు..ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల దాష్టీకానికి ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పే వరకు ప్రభుత్వంతో ఎలాంటి చర్చలూ ఉండబోవని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. పార్లమెంట్ భవన ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ.. సభలో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు.
‘‘కాంగ్రెస్ ఎంపీలు చర్చను ప్రారంభించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రకటన చేశారు. సభలో ఎవరి పేరైనా ప్రస్తావించినప్పుడు, వారు సమాధానం చెప్పేందుకు అవకాశం ఇవ్వడం సాధారణ ప్రక్రియ. కానీ, నేను రిజిజుకు సమాధానం ఇవ్వడానికి లేచినప్పుడు నన్ను మాట్లాడనివ్వలేదు, నా మైక్ కూడా ఆపివేశారు” అని విమర్శించారు.
