ఫోన్​ మాట్లాడొద్దన్నందుకు.. నైన్త్ క్లాస్ స్టూడెంట్ సూసైడ్

ఫోన్​ మాట్లాడొద్దన్నందుకు.. నైన్త్ క్లాస్ స్టూడెంట్ సూసైడ్

కాగజ్​నగర్, వెలుగు: సెల్​ఫోన్​లో ఎక్కువగా మాట్లాడొద్దని తండ్రి మందలించడంతో నైన్త్ క్లాస్ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం కుమ్రంభీం జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదం జరిగింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పూర్ టీ మండలం దుబ్బగూడకు చెందిన బస్కే రవి కూతురు సాక్షిత(15) నైన్త్ క్లాస్ చదువుతోంది. ఆమె అమ్మమ్మ ఆరోగ్యం బాగాలేకపోవడంతో కౌటాల మండలం కౌటి గ్రామంలో తండ్రి విడిచి వెళ్లాడు. ఆన్ లైన్ క్లాసులు నడుస్తుండటంతో సాక్షితకు మొబైల్ ఫోన్, పుస్తకాలు ఇచ్చారు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో తండ్రి రవి బిడ్డకు ఫోన్ చేయగా చాలా సేపు వెయిటింగ్ వచ్చింది. మరుసటి రోజు మళ్లీ ఫోన్ చేసి కూతురును మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన సాక్షిత మంగళవారం ఉదయం అమ్మమ్మ ఇంట్లోనే పురుగుల మందు తాగింది. కడుపునొప్పి వస్తుందని చెప్పడంతో వాళ్ళ బంధువైన శ్యామ్ రావు బాలికను సిర్పూర్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. మెరుగైన ట్రీట్​మెంట్ కోసం కాగజ్ నగర్ కు తరలించారు. అక్కడ ట్రీట్​మెంట్ పొందుతూ సాక్షిత గురువారం చనిపోయింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.