‘సెట్’ అయితలేదని ఊర్లకు పోతున్నరు

‘సెట్’ అయితలేదని ఊర్లకు పోతున్నరు

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో జరగాల్సిన ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అన్నీ పోస్ట్ పోన్ అవడంతో సిటీలో ఉండిపోయిన స్టూడెంట్స్ ఊళ్లకు వెళ్లిపోతున్నారు. గ్రేటర్​లో కరోనా స్పీడ్​గా స్ప్రెడ్​ అవుతుండడం, పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో క్లారిటీ లేకపోవడంతో రూమ్స్ ఖాళీ చేస్తున్నారు. లాక్ డౌన్​తో చిన్నచిన్న ఉద్యోగాలు చేసేవారు, చిరు వ్యాపారులు ఇప్పటికే ఇండ్లకు చేరుకున్నారు. అద్దె రూముల్లో ఉంటూ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కూడా ఇక్కడికన్నా ఊళ్లలోనే బెటర్ అని ఫీల్ అవుతున్నారు. కానీ, సిటీ హాస్టళ్లలో ఉండి ఇప్పటికే ఇండ్లకు వెళ్లినవాళ్లు మాత్రం పల్లెల్లో ఉండి ప్రిపేర్ అవడం కష్టమవుతోందని చెబుతున్నారు. మొబైల్ సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడం, డేటా అందక పోవడంతో ఆన్ లైన్ మాక్ టెస్ట్​లకు అటెండ్ అవలేకపోతున్నామంటున్నారు.

ప్రిపరేషన్ కు ఇబ్బందులు..

ఎంసెట్, ఐ సెట్, పాలిసెట్, ఈ సెట్, పీజీ ఈసెట్, లా సెట్, పీజీ ఎల్ సెట్, ఎడ్ సెట్ , పీఈ సెట్​ను ఈ నెల 6 నుంచి నిర్వహించాలనుకున్నా, కరోనా వ్యాప్తి కారణంగా ఉన్నత విద్యామండలి వాయిదా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా ఎంట్రన్స్​లకు అప్లయ్ చేసుకున్న వాళ్లు 4.50లక్షల మంది ఉండ గా, వారిలో లక్షన్నర మందికిపైగా నిన్న, మొన్నటి దాకా సిటీలోనే ఉన్నారు. ఊళ్లల్లో ఉంటూ ప్రిపేర్ అవుతున్న వాళ్లు.. వాతావరణం, సిగ్నల్స్ సరిగ్గా లేక ఇబ్బందవుతోందని చెప్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఎగ్జామ్స్ డేట్స్ మార్చారని, ఎప్పుడు పెడతారో తెలియక ఆందోళనగా ఉందని వాపోతున్నారు. ఉన్న ఊరికి దగ్గర్లోనే సెంటర్ ఆప్షన్ ఉన్నా, సరిగ్గా ప్రిపేర్ అవలేకపోతున్నామంటున్నారు.