- హరీశ్ రాణాకు లైఫ్ సపోర్ట్ తొలగించేందుకు అనుమతిస్తూ తీర్పు
- దేశంలో తొలిసారిగా అమలుకానున్న ‘రైట్ టు డై’ హక్కు
- 13 ఏండ్లుగా కోమాలో ఉన్న యూపీకి చెందిన హరీశ్ రాణా
న్యూఢిల్లీ: పదమూడేండ్లుగా కోమాలో ఉన్న 32 ఏండ్ల హరీశ్ రాణా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. అతడికి లైఫ్ సపోర్ట్ తొలగించేందుకు ఓకే చెప్పింది. ఎన్నో ఏండ్లుగా హరీశ్ను సంరక్షించుకుంటూ వస్తున్న అతడి వృద్ధ తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథ్ ధర్మాసనం బుధవారం ఈ తీర్పును వెలువరించింది. దీంతో ఇది మన దేశంలో పాసివ్ యుథనేషియా(కారుణ్య మరణం) అమలవుతున్న తొలి కేసుగా నిలిచింది.
ఆర్థికంగా చితికిపోయిన తల్లిదండ్రులు
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన హరీశ్ రాణా చండీగఢ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రమాదానికి గురయ్యాడు. 2013 ఆగస్ట్ 20న అతడు ఉంటున్న హాస్టల్ బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. దీంతో హరీశ్ తలకు దెబ్బతగిలి కోమాలోకి వెళ్లిపోయాడు. శరీరంలో ఎలాంటి కదలిక లేని స్థితికి చేరుకున్నాడు. ఎన్నో ఆస్పత్రులు తిరిగినా అతడి అనారోగ్యం నయం కాలేదు.
ఏండ్లు గడుస్తున్నప్పటికీ హరీశ్ హెల్త్ కండిషన్లో ఎలాంటి పురోగతి లేకుండాపోయింది. హరీశ్ను చూసుకుంటూ అతడి తల్లిదండ్రులు కూడా ఆర్థికంగా, మానసికంగా చితికిపోయారు. దీంతో 2024లో హరీశ్కు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ ఆ తల్లిదండ్రులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు అందుకు అంగీకరించలేదు. ఆపై సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడా నిరాశే ఎదురైంది.
హరీశ్ కోలుకునే అవకాశం లేదని డాక్టర్లు ఇచ్చిన స్పష్టమైన నివేదికతో మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్లగా కేసు విచారణకు అంగీకరించింది. మెడికల్ రిపోర్టులు పరిశీలించి, హరీశ్ తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ధర్మాసనం తీర్పునిచ్చింది.
తీర్పు చెప్తూ భావోద్వేగానికి గురైన జస్టిస్
డాక్టర్ల బాధ్యత ట్రీట్మెంట్ చేయడమేకానీ, అసలే ఆశలేని పరిస్థితిలో ఉన్న హరీశ్ జీవితాన్ని ఆర్టిఫీషియల్గా పొడిగించడం కాదని ధర్మాసనం పేర్కొంది. రైట్ టు డై అనే అంశాన్ని ఈ సందర్భంగా కోర్టు చర్చించింది. ఏఐఐఎంఎస్లో పాలియేటివ్ కేర్లో హరీశ్ను అడ్మిట్ చేసి, గౌరవప్రదంగా లైఫ్ సపోర్ట్ ఉపసంహరణకు తగిన ప్లాన్ చేయాలని ఆదేశించింది.
ఈ సందర్భంగా అతడి కుటంబం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ జస్టిస్ పార్థివాలా భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు.‘ ఈ నిర్ణయం లాజికల్గా కరెక్ట్ కాకపోవచ్చు. కానీ, ప్రేమ, జీవితం, నష్టం అనే అంశాలతో ముడిపడినది’ అని జస్టిస్ తెలిపారు.
షాన్బాగ్ కేసుతో కారుణ్య మరణం ప్రస్తావన
అరుణ షాన్బాగ్ కేసు 2011లో తొలిసారి కారుణ్య మరణంపై సుప్రీం కోర్టు చర్చించి పలు మార్గదర్శకాలు జారీ చేసింది. 2015లో ఆమె మరణానంతరం మరోసారి ఈ అంశంపై విచారించింది. గౌరవప్రదంగా మరణించడం అనేది ప్రాథమిక హక్కు అని గుర్తిస్తూ 2018లో కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేసింది. అప్పటి గైడ్లైన్స్కు అనుగుణంగానే తాజాగా హరీశ్ రాణా కేసులో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
