న్యూఢిల్లీ: ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థపై అవినీతి అనే అధ్యాయాన్ని రూపొందించిన ముగ్గురు నిపుణులను బాధ్యతల నుంచి తప్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ అధ్యాయాన్ని రూపొందించిన మిచెల్ డానినో, సుపర్ణా దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్ అనే ముగ్గురు ప్రొఫెసర్లకు ప్రభుత్వానికి సంబంధించిన ఏ సంస్థల్లోనూ ఇకపై చోటివ్వద్దొని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది.
ఈ నేపథ్యంలో భవిష్యత్తులో పాఠ్యాంశాల తయారీ, పాఠ్యపుస్తకాల ఖరారులో ఈ ముగ్గురికి ఏ విధంగా చోటు కల్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ నిధులు పొందే సంస్థలు వీరిని బాధ్యతల నుంచి తప్పించాలని ఆదేశించింది.
అన్ని పుస్తకాల పరిశీలనకు కమిటీ
ఇకమీదట ఎన్సీఈఆర్టీ 8 వ తరగతి మాత్రమే కాకుండా పై తరగతుల అన్ని పుస్తకాల్లో ఉండే లీగల్ స్టీడీస్కు సంబంధించిన పాఠ్యాంశాలను పరిశీలించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అందుకు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ కమిటీలో మాజీ సీనియర్ న్యాయమూర్తి, ప్రముఖ అకడమిషియన్, ఒక న్యాయవాది ఉండాలని సూచించింది. అవసరమైతే భోపాల్లోని నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ సహకారం తీసుకోవచ్చని తెలిపింది. సవరించిన వివాదాస్పద అధ్యాయాన్ని నిపుణుల కమిటీ పరిశీలించేంతవరకు పబ్లిష్ చేయొద్దని ఆదేశించింది.
