విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ : విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు శుక్రవారం (ఏప్రిల్ 28న) కీలక ఆదేశాలు జారీ చేసింది. రెచ్చగొట్టే ప్రసంగాలకు దేశ లౌకిక వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపే సామర్థ్యం ఉంటుందని వ్యాఖ్యానించింది. విద్వేష ప్రసంగాల విషయంలో ఫిర్యాదులు అందకపోయినా.. కేసులు నమోదు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు  ఆదేశించింది.  ఇందుకు సంబంధించి 2022లో ఇచ్చిన ఆదేశాల పరిధిని మరింత పెంచింది. 

విద్వేష ప్రసంగాలపై కేసులు నమోదు చేయకుండా ఆలస్యం చేస్తే కోర్టు ధిక్కరణ చర్యగా పరిగణించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కులం, మతం, వర్గంతో సంబంధం లేదని, చట్టాన్ని అతిక్రమించి ఎవరు విద్వేష ప్రసంగాలు చేసినా.. కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. 

విద్వేష ప్రసంగాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు 2022 అక్టోబర్‌లో ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలను ఆదేశించింది. ఇప్పుడు ఈ ఆదేశాలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించింది.