
తెలంగాణ స్థానికతపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అని తీర్పు ఇచ్చింది. ఇదే అంశంపై తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో 33ని సమర్థించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన సింగిల్ జడ్జి, డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది సుప్రీం కోర్టు. నీట్ కు ముందు 9,10,11,12 తరగతులను తెలంగాణలో చదవాల్సిందేనన్న నిబంధనను న్యాయస్థానం సమర్థించింది.
మెడికల్ సీట్ల వ్యవహారంలో స్థానికత అంశానికి సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై ఆగస్టు 5,2025న సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించిన సుప్రీం..ఈ మేరకు ఇవాళ సెప్టెంబర్ 1న తీర్పును వెల్లడించింది.
మెడికల్ కోర్సు అడ్మిషన్ల స్థానికతకు సంబంధించి నీట్కు ముందు నాలుగేండ్లు స్థానికంగా చదవాలని నిబంధనలు చేర్చుతూ.. తెలంగాణ ప్రభుత్వం జీవో 33ని తీసుకొచ్చింది. ఈ జీవోలోని నిబంధన 3 (ఏ)లో ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొంది. ఈ జీవోను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ కు చెందిన కల్లూరి అభిరామ్ తో పాటు మరో 160 మంది రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం.. ‘ఒక విద్యార్థి తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వ గైడ్ లైన్స్ లేవు. మొదట గైడ్ లైన్స్, రూల్స్ రూపొందించాలి’అని ప్రభుత్వానికి సూచిస్తూ విద్యార్థులకు ఫేవర్ గా 2024 సెప్టెంబర్ 5న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ 2025 సెప్టెంబర్ 11న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ ఎస్ఎల్పీని మంగళవారం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని జస్టిస్ కె వినోద్ చంద్రన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారరించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ, కాళోజీ వర్సిటీ తరఫున సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకర్ నారాయణన్ వాదనలు వినిపించారు. సీజేఐ కోర్టు జాబితాలో మొదటి అంశంగా ప్రారంభమైన ఈ కేసు విచారణ 2025 ఆగస్టు 5 న దాదాపు రెండున్నర గంటల పాటు సాగింది. అన్ని వైపులా సుదీర్ఘ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని వాది, ప్రతివాదులకు సూచిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ సెప్టెంబర్ 1న తీర్పు వెల్లడించింది సుప్రీం కోర్టు.. గతంలొ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ..తెలంగాణ ప్రభుత్వ జీవోను సమర్థించింది. నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అనే నిబంధనను సమర్థించింది.