లోన్ మారటోరియం పై కేంద్రానికి సుప్రీం గడువు

లోన్ మారటోరియం పై కేంద్రానికి సుప్రీం గడువు

లోన్ మారటోరియాన్ని పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు…. స్పందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇవాళ(సోమవారం) కేసు విచారణకు రాగా, మారటోరియం ప్రణాళికను అందించేందుకు తమకు మరికొంత సమయం కావాలని కేంద్రం కోరింది. దీంతో వారం రోజుల గడువు ఇస్తూ, కేసు తదుపరి విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది సుప్రీం. ఇప్పటికే మారటోరియాన్ని పొడిగించేందుకు కేంద్రం సానుకూలంగా ఉన్న సంకేతాలు వచ్చాయి. రెండేళ్ల పాటు దీన్ని అమలు చేయాలని కూడా కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం.

ఈ కేసులో కేంద్రం, ఆర్బీఐ తరఫున సోమవారం  విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కొన్ని అంశాలు తన నియంత్రణలో లేవని, మారటోరియం పొడిగింపుపై ప్రభుత్వ ఆలోచనను తెలిపేందుకు మరింత సమయం కావాలని కోరారు. ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయని, అవి పూర్తి కావడానికి ఇంకొంత సమయం పడుతుందని తెలిపారు. దీనికి ధర్మాసనం అంగీకరించింది.

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా బ్యాంకులు ఇచ్చిన రుణాలకు సంబంధించి, రుణగ్రహీతల ఈఎంఐల చెల్లింపులపై మొదట మూడు నెలలు, ఆ తర్వాత మరో మూడు నెలల పాటు మారటోరియాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ గడువు ఇప్పటికే తీరిపోయింది. అయినప్పటికీ, మారటోరియాన్ని పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు… స్పందించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.