
సూర్యాపేట, వెలుగు: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా బుధవారం సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలో కొప్పుల వేణారెడ్డి ఎడ్లతో పొలం దున్ని రైతులతో కలిసి పెసర విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఒక్క గుంట కూడా బీడు లేకుండా పంటలు వేయాలని సూచించారు.
రైతులు ఎక్కడ బీడు లేకుండా చూడాలన్నారు. రైతులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సాయం, మద్దతు ధర ఇస్తుందన్నారు. దేశంలో ఉత్పత్తులు ఎగుమతి చేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ వీరన్న నాయక్, కరీం, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అభినయ్, నాయకులు తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, సాయి నేత, ఆలేటి మాణిక్యం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.