
సూర్యాపేట, వెలుగు: నేర తీవ్రత తక్కువగా ఉన్న కేసుల్లోనూ ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరిగి డబ్బు, సమయాన్ని వృథా చేసుకోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద సూచించారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లా న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 3,013 కేసులను పరిష్కరించి, రూ.1.92 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. సూర్యాపేట ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి రజిత, అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపెల్లి లింగయ్య పాల్గొన్నారు.
రాజీ పడిన కేసుల్లో అప్పీల్ ఉండదు
నల్గొండ అర్బన్, వెలుగు: లోక్ అదాలత్ లో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. రాజీపడిన కేసుల్లో అప్పీల్ ఉండదని పేర్కొన్నారు. శనివారం నల్గొండ జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్ అదాలత్ లో ఆయన మాట్లాడారు. జిల్లాలో 38 సివిల్, 15,837 క్రిమినల్, 85 మోటార్ వాహన ప్రమాద బీమా, 28 బ్యాంక్, 25 సైబర్ క్రైం, 80 ట్రాన్స్కో, 5,567 ట్రాఫిక్ చలానా కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. సీనియర్ సివిల్ జడ్జి, కార్యదర్శి పి.పురుషోత్తమరావు, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కట్ట అనంతరెడ్డి, మంద నగేశ్ తదితరులున్నారు.
లోక్ అదాలత్ చక్కని మార్గం
కోదాడ, వెలుగు: పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కని మార్గమని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి సురేశ్అన్నారు. శనివారం కోదాడ కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కు హాజరై, మాట్లాడారు. క్రిమినల్ కేసులు 354, సివిల్ 5, నేరం ఒప్పుకున్నవి 45, బ్యాంక్ కేసులు 65 ద్వారా రూ.56 లక్షలు, జరిమానా ద్వారా రూ.1.90 లక్షలు, ఎస్టీసీ కేసులు 764 ద్వారా రూ.25 వేలు వసూలైనట్లు చెప్పారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి భవ్య, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సత్యనారాయణ, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి రామకృష్ణ పాల్గొన్నారు.
కేసులను పరిష్కరించుకోవాలి
యాదాద్రి, వెలుగు: యారాజీ పడి, కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు అన్నారు. జిల్లాలోని 8 కోర్టుల్లో శనివారం ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ లో 9,411 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు.
రాజీ పడితేనే మేలు
నకిరేకల్, వెలుగు: పెండింగ్ కేసుల్లో లోక్అదాలత్ ద్వారా రాజీ పడితేనే మేలు జరుగుతుందని నకిరేకల్ సీనియర్ సివిల్ జడ్జి కుమారి మంజుల సూర్యవర్ అన్నారు. శనివారం నకిరేకల్ మున్సిఫ్ కోర్డులో నిర్వహించిన లోక్ అదాలత్ కు హాజరై, మాట్లాడారు. 76 క్రిమినల్ కేసులు, 3 సివిల్, 31 జరిమానా, మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నవి 660, ఇతర కేసులు 120 పరిష్కరించినట్లు పేర్కొన్నారు. రూ.9,73,610 జరిమానా విధించినట్లు తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జి షేక్ ఆరిఫ్, నకిరేకల్, శాలిగౌరారం సీఐలు రాజశేఖర్, కొండల్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శంభయ్య పాల్గొన్నారు.
6 సివిల్, 785 క్రిమినల్ కేసుల్లో రాజీ
హుజూర్ నగర్, వెలుగు: లోక్ అదాలత్ లో 791 కేసులను పరిష్కరించినట్లు ఇన్చార్జి జూనియర్ సివిల్ జడ్జి భవ్య తెలిపారు. శనివారం హుజూర్ నగర్ కోర్టు పరిధిలో 6 సివిల్,785 క్రిమినల్ కేసుల్లో రాజీ కుదిర్చినట్లు పేర్కొన్నారు. లోక్ అదాలత్ సభ్యులు కృష్ణయ్య, ప్రశాంత్, సత్యనారాయణ, చనగాని యాదగిరి, కాల్వ శ్రీనివాసరావు, ఎంఎస్.రాఘవరావు, రవికుమార్, సైదా హుస్సేన్ పాల్గొన్నారు.