- ఇప్పటికే పూర్తయిన అడ్మిషన్లు
- ఆందోళనలో స్టూడెంట్లు, పేరెంట్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేటు జూనియర్కాలేజీలకు అఫిలియేషన్ (గుర్తింపు)పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అఫిలియేషన్కు గతేడాది మాదిరి సర్కార్ కొన్ని రూల్స్ సడలించినా, మిక్స్డ్ ఆక్యుపెన్సీ బిల్డింగుల్లో కొనసాగుతున్న కాలేజీలకు గుర్తింపుపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తయ్యాయి. దీంతో స్టూడెంట్లు, పేరెంట్స్లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా1,626 ప్రైవేట్జూనియర్ కాలేజీలు ఉండగా.. వాటిలో 426 మిక్స్డ్ ఆక్యుపెన్సీ బిల్డింగుల్లో కొనసాగుతున్నాయి. ఇవి గాక ఆయా బిల్డింగుల్లో 15 మీటర్ల పైన ఉన్న కాలేజీలు 66 ఉన్నాయి. పోయినేడాది ఫైర్ సేఫ్టీ విషయయమై ఆ కాలేజీలకు సర్కార్ గుర్తింపు ఇవ్వలేదు. తర్వాత మేనేజ్మెంట్ల ఒత్తిడి, కరోనా కారణంగా మిక్స్డ్ ఆక్యుపెన్సీ బిల్డింగుల్లోని కాలేజీలకు పర్మిషన్ ఇచ్చిన సర్కార్.. 15 మీటర్ల పైన ఉన్న 66 కాలేజీలకు మాత్రం గుర్తింపు ఇవ్వలేదు. వాటిలో కొన్ని కాలేజీలు మూతపడగా, మరికొన్నింటిని వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేశారు. ఈ ఏడాది మళ్లీ అదే సమస్య తలెత్తింది. ఈసారి కూడా మిక్స్డ్ ఆక్యుపెన్సీ బిల్డింగుల్లోని కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని మేనేజ్మెంట్లు కోరడంతో ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ జూన్24న విద్యాశాఖకు లెటర్ రాశారు. అయితే విద్యాశాఖ ఇప్పటి వరకు దానిపై క్లారిటీ ఇవ్వలేదు. సీఎం కేసీఆర్, మినిస్టర్ సబితారెడ్డి చొరవ తీసుకుని ఆ కాలేజీలకు గుర్తింపు ఇవ్వాలని ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీశ్ విజ్ఞప్తి చేశారు.
ఒక్క కాలేజీకి గుర్తింపు రాలే..
ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క ప్రైవేట్ కాలేజీకి కూడా ఇంటర్ బోర్డు అధికారికంగా గుర్తింపు ఇవ్వలేదు. రెండు వారాల కింద సర్కార్ నిబంధనలు సడలించగా, మేనేజ్ మెంట్లు అప్లికేషన్లు పెట్టుకుంటున్నాయి. ఈసారి 52 కాలేజీలు షిఫ్టింగ్కు దరఖాస్తు చేసుకోగా, ఆ కాలేజీల్లోనూ అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. అయినా బోర్డు మాత్రం ఆ కాలేజీలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు గుర్తింపు లేని, అనుమతి లేని భవనాల్లో కొనసాగే కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకోవద్దని.. అలాంటి కాలేజీలపై చర్యలు తీసుకుంటామని ఉమర్ జలీల్ ఇటీవల హెచ్చరించడం గమనార్హం.