
చెన్నై: తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితురాలైన సినీ నటి మీనా పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. భారతీయ జనతా పార్టీలో (BJP) చేరేందుకు ఆమె రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. భారత ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్తో ఆమె భేటీ అయిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ను ఈ విషయం గురించి అడగ్గా.. తమిళనాడుకు చెందిన చాలామంది ప్రముఖులు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పుకొచ్చారు. బీజేపీలో మీనా చేరిక వార్తలను ఆయన పరోక్షంగా నిర్ధారించినట్లయింది. మీనా బీజేపీలో చేరితే ఆమెకు రాష్ట్ర స్థాయి పదవి దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మీనా సేవలను వినియోగించుకోవాలని.. ఎన్నికల ప్రచారంలో మీనా స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని కమలం పార్టీ భావిస్తోంది.
తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ ఇంట్లో ఇటీవల జరిగిన ఫంక్షన్కు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, బీజేపీ మహిళా నేత వనతీ శ్రీనివాసన్ హాజరయ్యారు. వీళ్లతో పాటు సినీ నటి మీనా కూడా ఈ ఫంక్షన్కు అటెండ్ కావడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎల్.మురుగన్ కుటుంబంతో మీనాకు ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఆమె ఈ ఫంక్షన్కు అటెండ్ అయిందని చెప్పుకున్నారు. కానీ అసలు కారణం వేరే ఉందని.. ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలతో సమావేశం అయి.. బీజేపీలో చేరేందుకు తాను ఆసక్తితో ఉన్నట్లు తెలియజేసేందుకే ఆమె ఎల్.మురుగన్ ఇంట్లో ఫంక్షన్కు అటెండ్ అయినట్లు తమిళ మీడియాలో చర్చ జరిగింది.
దక్షిణాది సినీ తారలు రాజకీయాల్లో రావడం ఇవాళ కొత్తేం కాదు. విజయశాంతి, జయసుధ, జయప్రద, రోజా, జీవిత, సుమలత, రమ్య, ఖుష్భూ సుందర్.. వీళ్లంతా ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్న వాళ్లే కావడం గమనార్హం. మీనా కూడా బీజేపీలో చేరితే మరో దక్షిణాది సినీ తార పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్టే.