విస్తృతంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులను ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నామని, విద్యార్థులు నేరుగా తర్వాతి తరగతికి ప్రమోట్ అవుతారని పళనిస్వామి ప్రభుత్వం ప్రకటించింది.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఈనెల 15 నుంచి నిర్వహించనున్నట్టు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే దీనిపై స్టే విధించాలని కోరుతూ రాష్ట్ర మహోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు భక్తవత్సలం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు వినిత్ కొథారి, ఆర్.సురేష్కుమార్లతో కూడిన ధర్మాసనం కరోనా మహమ్మారి ప్రబలుతున్న దృష్ట్యా పరీక్షలకు అనుమతించబోమని, ఈ సమయంలో పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని తెలిపింది. జూలై రెండో వారంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను జరిపేందుకు వీలుపడుతుందో లేదో బదులివ్వాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. కేసు తదుపరి విచారణ ను ఈనెల 11కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి పదో తరగతి పబ్లిక్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.