
- యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలె
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రైతులకు అవసరమైనంత యూరియాను ప్రభుత్వం వెంటనే అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో కోరారు. నెలరోజుల వర్షాభావం తర్వాత ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయని, దీంతో మెట్ట, మాగాణి పంటలకు యూరియా వేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. యూరియా వేయడంలో జాప్యం చేస్తే పంటల దిగుబడులు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుల అవసరాలను గమనించి మార్కెట్లో వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టిస్తారని పేర్కొన్నారు. యూరియా బస్తా రూ.276 ఉంటే చాలా చోట్ల రూ.వంద ఎక్కువ తీసుకొని అమ్ముతున్నారని చెప్పారు. వానాకాలం పంటలకు 10.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని, వ్యవసాయ శాఖ మంత్రి ఆ మేరకు నిల్వలు ఉన్నాయని చెప్తున్నా, యూరియా మాత్రం అందుబాటులో లేదని తమ్మినేని తెలిపారు.