నమ్మక ద్రోహం: అన్నం పెట్టిన సంస్థకే సున్నంపెట్టారు ..డబ్బు కొట్టేశారు... దొంగలు ఎత్తెకెళ్లారన్నారు..

నమ్మక ద్రోహం:  అన్నం పెట్టిన సంస్థకే సున్నంపెట్టారు ..డబ్బు కొట్టేశారు... దొంగలు ఎత్తెకెళ్లారన్నారు..
  • రూ.17 లక్షలు కాజేసిచోరీగా నమ్మించే ప్రయత్నం
  • గంటల వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులు

బషీర్​బాగ్, వెలుగు: తాము పనిచేస్తున్న సంస్థకే కన్నం వేయాలని చూశారు ఇద్దరు కేటుగాళ్లు. యాక్సిడెంట్​ డ్రామాతో రూ.17 లక్షలు కొట్టేశారు. చోరీ అయినట్లు యజమానిని నమ్మించారు. చివరికి పోలీసుల దర్యాప్తులో అసలు బాగోతం బయట పడడంతో కటకటాలపాలయ్యారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బషీర్ బాగ్ లో సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. 

మలక్​పేటకు చెందిన గోపాల్ తపరియా చిట్​ఫడ్​ కంపెనీని నడిపిస్తున్నారు. అందులో ముసారంబాగ్​కు చెందిన జితిన్​ రాజ్​యాదవ్​ కలెక్షన్​ ఏజెంటుగా, మలక్​పేటకు చెందిన అభిలాశ్​ ఆఫీస్​ బాయ్​గా పనిచేస్తున్నారు. జితిన్​ రాజ్​యాదవ్​ చిట్​ఫండ్​కు సంబంధించి రూ.17 లక్షలు కాజేయాలని భావించాడు. ఇందుకోసం ఓ కట్టుకథ అల్లాడు. 

బుధవారం నగదు ఉన్న బ్యాగును దొంగలు ఎత్తుకెళ్లినట్లు యజమానికి తెలిపాడు. అబిడ్స్ నుంచి జూబ్లీహిల్స్ కు బైక్ పై వెళ్తుండగా అప్పర్ ట్యాంక్ బండ్ పై బైక్ అదుపుతప్పి కింద పడిపోయానని, ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బ్యాగును ఎత్తుకెళ్లాడని నమ్మించాడు. 

తాను గాంధీ హాస్పిటల్ లో ట్రీట్​మెంట్ తీసుకుంటున్నట్లు యజమానికి చెప్పాడు. దీంతో యజమాని గోపాల్ అర్ధరాత్రి ఒంటిగంటకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు సీసీటీవీ ఫుటేజ్ లు పరిశీలించగా చోరీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. జితిన్ పై అనుమానం వచ్చి ఆయనను విచారించారు. కలెక్షన్ చేసిన రూ.17 లక్షలు ఆఫీస్ బాయ్ అభిలాశ్​కు ఇచ్చి తన ఇంటికి పంపించానని ఒప్పుకున్నాడు. ఇందుకోసం ఆఫీస్​బాయ్​కు రూ.2.5 లక్షలు ఇచ్చినట్లు తెలిపాడు.

 పోలీసులు వారి వద్ద రూ.17 లక్షలు రికవరీ చేసి ఇద్దరిని రిమాండ్ కు తరలించారు. కొన్ని గంటల వ్యవధిలోనే కేసును ఛేదించినట్లు డీసీపీ తెలిపారు. సమావేశంలో సెంట్రల్ జోన్ అడిషనల్ డీసీపీ బి.ఆనంద్, దోమలగూడా సీఐ డి.శ్రీనివాసరెడ్డి, డీఐ మల్లేశం పాల్గొన్నారు.