యోధా 2.0, ఇంట్రా వీ20 బయోఫ్యూయల్, ఇంట్రా వీ50 పేరుతో టాటా మోటార్స్ పికప్ ట్రక్కులను లాంచ్ చేసింది. ఇవి వ్యవసాయం, పౌల్ట్రీ, డెయిరీ వంటి సెక్టార్ల అవసరాలను తీర్చగలుగుతాయి. ఎఫ్ఎంసీజీ, ఈ-కామర్స్ లాజిస్టిక్స్ రంగాల డెలివరీలకూ ఉపయోగపడుతాయి. ఈ ట్రక్కులు బలంగా ఉంటాయని, కొత్త డిజైన్తో ముస్తాబయ్యాయని కంపెనీ తెలిపింది. మునుపటి వేరియంట్లతో పోలిస్తే లోడ్-మోసే సామర్థ్యం ఎక్కువని, డెక్ విశాలంగా ఉంటుందని పేర్కొంది. టాటా మోటార్స్ దేశవ్యాప్తంగా సోమవారం 750 యూనిట్లను డెలివరీ చేసిందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ చెప్పారు. తమ చిన్న వాణిజ్య వెహికల్స్ లక్షల మంది వినియోగదారులకు జీవనోపాధిని అందిస్తున్నాయని అన్నారు. సౌకర్యవంతమైన, సురక్షిత డ్రైవింగ్ కోసం వీటిలో ఎన్నో ఫీచర్లను చేర్చామని చెప్పారు. యోధా 2.0కు రెండు వేల కేజీ పేలోడ్ సామర్థ్యం ఉంటుంది. ఇది 1,200, 1,500 1,700 కేజీ పేలోడ్ వేరియంట్లలోనూ అందుబాటులో ఉంటుంది. ఇంట్రా వీ50 పేలోడ్ కెపాసిటీ 1,500కేజీలు. ఇంట్రా వీ20 దాదాపు 1,000 కేజీ పేలోడ్ కెపాసిటీ కలిగిన బయో ఫ్యూయల్ పికప్ ట్రక్. సీఎన్జీతోపాటు పెట్రోల్తోనూ పనిచేస్తుంది. ఇందులో వాక్త్రూ క్యాబిన్, డ్యాష్-మౌంటెడ్ గేర్ లివర్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. యోధా 2.0 ధర రూ. 9.99 లక్షలు, ఇంట్రా వీ50 ధర రూ. 8.67 లక్షలు, ఇంట్రా వీ20 ధర రూ.7.33 లక్షలు ( ఎక్స్షోరూం).
‑ వెలుగు, హైదరాబాద్