సొంత గూటికి ఎయిరిండియా.. 68 ఏండ్ల తర్వాత దక్కించుకున్న టాటా

సొంత గూటికి ఎయిరిండియా.. 68 ఏండ్ల తర్వాత  దక్కించుకున్న టాటా

న్యూఢిల్లీ: టాటా గ్రూప్స్ చైర్మన్ రతన్ టాటా ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించారు. దేశీ విమానయానంలో కీలకంగా ఉన్న ఎయిర్ ఇండియాను దశాబ్దాల తర్వాత టాటా సన్స్ హస్తగతం చేసుకుంది. ఎయిర్ ఇండియా సంస్థకు మొత్తం 61వేల 562 కోట్ల అప్పులు ఉండడంతో ఎయిర్ ఇండియాలోని పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో పలు ప్రైవేట్ కంపెనీలు బిడ్ దాఖలు చేశాయి. ఈ లిస్టులో టాటా సన్స్ ఎక్కువ బిడ్ దాఖలు చేసి ఎయిర్ ఇండియాను సొంతం చేసుకుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇవాళ ప్రకటించింది.  డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ సెక్రెటరీ తుహిన్‌ కాంత, సివిల్ ఏవియేషన్ సెక్రెటరీ రాజీవ్ బన్సల్ మీడియా సమావేశం పెట్టి ఈ విషయాన్ని వెల్లడించారు.  ఎయిర్ ఇండియాను దక్కించుకోవడం కోసం టాటా గ్రూప్‌తో పాటు ఏడు కంపెనీలు బిడ్ దాఖలు చేయగా.. అందులో ఐదు కంపెనీలు డిస్‌ క్వాలిఫై అయ్యాయని తెలిపారు. మిగిలిన రెండు కంపెనీల్లో టాటా సన్స్ అత్యధిక బిడ్ వేయడంతో ఆ సంస్థ ఎయిర్‌‌ ఇండియాను దక్కించుకుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బిడ్ ధర రూ.12,906 కోట్లుగా నిర్ణయించగా.. దాని కంటే దాదాపు 500 కోట్లు ఎక్కువగా టాటా సన్స్ రూ.18 వేల కోట్లకు బిడ్ వేసి, 100 శాతం ఎయిరిండియా షేర్ సొంతం చేసుకుందన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌‌లో ఎయిరిండియా టాటా చేతిలోకి వెళ్తుందన్నారు. ఏడాది పాటు ఎయిరిండియలో ఉన్న ఉద్యోగులను అందరినీ కచ్చితంగా టాటా కొనసాగించాలని, రెండో ఏడాదిలో స్వచ్ఛంద పదవీ విరమణ ఇవ్వొచ్చని తెలిపారు.

సొంత కంపెనీ తిరిగి హస్తగతం

ఎయిర్ ఇండియాను 1932 లో జేఆర్‌డీ టాటా స్థాపించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత  విమానయాన రంగాన్ని జాతీయం చేయడంతో ఎయిర్ ఇండియాలో టాటా ఎయిర్‌లైన్స్‌కు ఉన్న 49 శాతం వాటాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.  ఆ తర్వాత కంపెనీని అప్పటి సర్కార్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చింది. దీంతో సంస్థ పేరును ఎయిర్ ఇండియాగా పేరు మార్చారు. 1953 లో ప్రభుత్వం ఎయిర్ కార్పొరేషన్ చట్టాన్ని ఆమోదించింది. కంపెనీ వ్యవస్థాపకుడు జేఆర్‌డీ టాటా నుంచి యాజమాన్య హక్కులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ తర్వాత కంపెనీకి మళ్లీ ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ లిమిటెడ్ అని పేరు పెట్టారు. ఇప్పుడు మళ్లీ ఎయిరిండియాను టాటా గ్రూప్ దక్కించుకోవడం ద్వారా 68 సంవత్సరాల తర్వాత మరోసారి సొంత కంపెనీని తిరిగి పొందినట్లయింది.