​యూట్యూబ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇస్తాం: నారా లోకేశ్

​యూట్యూబ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇస్తాం: నారా లోకేశ్

ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టుల అక్రిడిటేషన్, టిడ్కో ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర మే 20వ తేదీ శనివారం బనగానపల్లి నియోజకవర్గంలో ప్రవేశించింది. బనగానపల్లి నియోజకవర్గం టంగుటూరులో యువనేతను చూసేందుకు జనం పెద్దఎత్తున తరలిరావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పాదయాత్ర సందర్భంగా వివిధ వర్గాలతో మాట్లాడుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ లోకేశ్ ముందుకు సాగారు.

తటస్థ ప్రముఖులతో లోకేశ్ ముఖాముఖి

ఈ ఉదయం నంద్యాల నియోజకవర్గం రాయపాడు క్యాంప్ సైట్ లో తటస్థ ప్రముఖులతో లోకేశ్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎందుకు నివాళులు అర్పించారు అని కొంతమంది నన్ను అడిగారు, నేను వైఎస్ తీసుకున్న అన్ని నిర్ణయాలతో ఏకీభవించను. కానీ ఆయన ఏనాడూ రాష్ట్ర పరువు తీసేలా ప్రవర్తించలేదు. చంద్రబాబు తీసుకొచ్చిన ప్రాజెక్టులు అన్ని కొనసాగించారు, అందుకే ఆయనంటే గౌరవం" అని వివరించారు. ఇక, జగన్ రాష్ట్రం పరువు తీశాడని, దక్షిణాది బీహార్ గా ఏపీని మార్చేశాడని విమర్శించారు. 

"ఆఖరికి మీడియాపై కూడా జగన్ అండ్ కో దాడులకు తెగబడుతున్నారు. న్యాయవాదులు, టీచర్లు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు ఇలా అందరూ జగన్ బాధితులే. టీచర్లను మద్యం షాపుల ముందు నిలబెట్టి అవమానించారు. తటస్థులంతా ఒకసారి ఆలోచించాలి. ఒక్క ఫాక్స్ కాన్ సంస్థను ఏపీకి తీసుకురావడానికి నేను ఎంతో కష్టపడ్డాను. ఇప్పుడు ఆ కంపెనీని తెలంగాణకు తరిమేశాడు జగన్. దీని వలన లక్ష మంది ఏపీ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు" అని లోకేశ్ తెలిపారు.

మెగా డీఎస్సీ హామీ ఏమైంది జగన్...?

ఎన్నికల ముందు మెగా డీఎస్సీ అన్న జగన్ ఆ హామీ మర్చిపోయాడని లోకేశ్ విమర్శించారు. లక్షలు ఖర్చు చేసి ట్రైనింగ్ తీసుకొని నోటిఫికేషన్ రాక ఇబ్బంది పడుతున్న ఎంతో మంది యువకులు ఉన్నారని వెల్లడించారు. "టీడీపీ హయాంలో డీఎస్సీ క్రమం తప్పకుండా నిర్వహించాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు, స్వయం ఉపాధి ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం. రాయలసీమను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చాలని టీడీపీ ప్రణాళిక సిద్దం చేసింది. ఆటో మొబైల్, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు పెద్ద ఎత్తున ఏపీకి తెచ్చింది చంద్రబాబు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పింక్ కాలర్ జాబ్స్... మహిళలకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం" అని లోకేశ్ వెల్లడించారు.

జర్నలిస్టులను కూడా వేధిస్తున్న జగన్ ప్రభుత్వం!

జర్నలిస్టులను కూడా జగన్ ప్రభుత్వం అనేక విధాలుగా వేధిస్తోందని నారా లోకేశ్ ఆరోపించారు. 2430 జీవో తీసుకువచ్చి జర్నలిస్టులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డరారు. "జర్నలిస్టులపై వేధింపులు, అరెస్టులు చేస్తున్నారు. జగన్ తెచ్చిన 2430 జీవో రద్దు చేస్తాం. ఇళ్ళ గురించి అడిగితే సజ్జల జర్నలిస్టులపై విరుచుకుపడ్డారు. ఆఖరికి అక్రిడిటేషన్ కార్డులు కూడా రద్దు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రిడిటేషన్, టిడ్కో ఇళ్లు ఇస్తాం. యూట్యూబ్ ఛానెల్స్ కూడా చాలా పాపులర్ అయ్యాయి. వాటికి కొన్ని నిబంధనలు, షరతులు పెట్టి వారికి కూడా అక్రిడిటేషన్ సౌకర్యం కల్పిస్తాం. ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఈ-మెయిల్ పెడితే అప్పటికప్పుడే నేను పరిష్కరించి న్యాయం చేశాను. 'మీ సేవ' సెంటర్లు నడుపుతున్న వారికి వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 'మీ సేవ' వ్యవస్థను పటిష్ట పరుస్తాం. ప్రభుత్వ సేవలు అన్ని 'మీ సేవ' ద్వారా అందిస్తాం" అని లోకేశ్ వెల్లడించారు.

పేదరికం లేని సమాజం టీడీపీ లక్ష్యం

పేదరికం లేని రాష్ట్రం టీడీపీ విధానం అని లోకేశ్ ఉద్ఘాటించారు. పేదలు ఎప్పటికీ పేదలుగా ఉండాలి అనేది జగన్ విధానం అని విమర్శించారు. జగన్ ది ఫ్యాక్షన్ మనస్తత్వం అని వ్యాఖ్యానించారు లోకేశ్. "మేం అధికారంలోకి వస్తే ప్రైవేట్ టీచర్లను కూడా ఆదుకుంటాం. కొవిడ్ సమయంలో వైసీపీ ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లను ఆదుకోలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా అందిస్తాం. టీడీపీ హయాంలో రూ.5,300 కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవ కోసం ఖర్చు చేసాం. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వకపోవడం వలన ఆసుపత్రులు సేవలు నిలిపివేస్తామని అంటున్నాయి. రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆర్యవైశ్యులు కూడా జగన్ బాధితులే. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నులు తగ్గించి ఆర్యవైశ్యులు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే వాతావరణం ఏర్పాటు చేస్తాం. పోలీసులు కూడా జగన్ బాధితులే. జీపీఎఫ్ డబ్బులు కూడా కొట్టేశాడు. సరెండర్లు, మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులను కూడా కొత్త ఆర్డర్స్ ఇచ్చి 18 రకాల వ్యక్తిగత వివరాలు సేకరించి ప్రభుత్వం వేధిస్తోంది" అని నారా లోకేశ్ పేర్కొన్నారు.