
కారు ప్రమాదానికి గురైన టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్కు చిన్న ప్లాస్టిక్ సర్జరీ జరిగింది. ఈ మేరకు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ వెల్లడించారు. పంత్ ఫేస్ పై గాయాలు కావడంతో..డెహ్రడూన్ లోని మ్యాక్స్ ఆసుపత్రిలో అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు తెలిపారు. పంత్ కు మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించాలని అనుకున్నా..చివరకు మ్యాక్స్ లోనే శస్త్ర చికిత్స చేసినట్లు పేర్కొన్నారు.
మరోవైపు రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ఇప్పటికే డెహ్రాడూన్కు వచ్చిన ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ బృందం పంత్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. పంత్ ఆరోగ్యానికి సంబంధించి నివేదికలను తెప్పించుకుంటూ అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు డీడీసీఏ ప్రకటించింది.
అటు పంత్ కు ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత అతనికి ఎక్స్ రే తీశారు. అయితే పంత్ కుడి కాలు లిగ్మెంట్ కొద్దిగా జరిగినట్లే రిపోర్టులో స్పష్టమైంది. దీనికి తోడు నుదుటి భాగంలో గాయాలయ్యాయి. మరోవైపు మెదడు, వెన్నెముకకు సంబంధించిన ఎంఆర్ఐ స్కానింగ్లో ఎలాంటి సమస్య లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.