భవిష్యత్లో టీమిండియా మెగా టోర్నీలు గెలవాలంటే తక్షణం మిడిలార్డర్ను ప్రక్షాళన చేయాలి. ఒక్కో టోర్నీ కోసం కాకుండా నాలుగైదేళ్లు సేవలందించే బలమైన ‘మధ్య’మాన్ని తయారు చేసుకోవాలి’ మాజీలతో పాటు క్రికెట్ అభిమానులు చేస్తున్న పెద్ద డిమాండ్ ఇది..! మరి ఇప్పటికిప్పుడు ఇది సాధ్యమవుతుందా? అంత గొప్పగా సేవలందించే బలమైన రిజర్వ్ బెంచ్ ఇండియాకు ఉందా? ఇప్పుడున్న మెరికల్లాంటి కుర్రాళ్లు టీమిండియా భవిష్యత్కు ధ్రువతారాలుగా మారతారా? వీటికి జవాబు లభించాలంటే కొంతకాలం ఆగక తప్పదేమో..!
అంచనాలు ఎలా ఉన్నా.. ఎన్ని లోపాలు అంతర్గతంగా కొనసాగుతున్నా.. ఈసారి టీమిండియా వరల్డ్కప్ గెలిచి తీరుతుంది.. మెగా ఈవెంట్కు ముందు సగటు అభిమాని అంచనా ఇది. కానీ ఏమైంది..? లీగ్ దశలో తిరుగులేని విజయాలతో దూసుకుపోయిన విరాట్సేన ఒకే ఒక్క ఓటమితో టోర్నీకే దూరమైంది. కారణం.. చాలా ఏళ్లుగా ఉన్న మిడిలార్డర్ లోపాలను సరిదిద్దుకోకపోవడమే..! పక్కా ప్రణాళికలు లేకుండా కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్ను తీసుకోవడంతోనే మిడిలార్డర్ డొల్లతనం ఏంటో స్పష్టమైంది. ఈ వరల్డ్కప్ ఫెర్ఫామెన్స్తో ఈ ఇద్దరికి ఎండ్ కార్డు పడ్డట్లే. జట్టుతో పాటే ఉన్న జడేజాకు పెద్దగా అవకాశాలు ఇవ్వకపోవడం కూడా ఓటమికి అతిపెద్ద కారణంగా చెప్పొచ్చు. మరి ఇప్పుడైనా మేనేజ్మెంట్, సెలెక్టర్లు భవిష్యత్పై దృష్టి పెట్టి మిడిలార్డర్ను బలోపేతం చేస్తారా?
వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్కప్ జరుగనుంది. దీని దృష్ట్యా ఇప్పటి నుంచే టీమ్ను సిద్ధం చేయాల్సిన బాధ్యత మేనేజ్మెంట్పై ఉంది. ఇంతకుముందు ధోనీ కెప్టెన్గా ఉన్నప్పుడు ఏదైనా మెగా ఈవెంట్ ఉందంటే రెండేళ్ల నుంచే జట్టును సంసిద్ధం చేసే సంప్రదాయం ఉండేది. కెప్టెన్, మేనేజ్మెంట్ దృష్టిలో ఉన్న ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చేవారు. కోహ్లీ హయాంలోనూ ఇది కొనసాగినా.. కొన్నిసార్లు తప్పిదాలు చేశారు. సూపర్ ఫామ్లో ఉన్న రాయుడును కాదని ‘త్రీ డైమెన్షన్’ శంకర్ను తీసుకోవడం, గాయంతో ఆటకు దూరంగా ఉన్న కేదార్ను పట్టుబట్టి ఇంగ్లండ్కు తీసుకెళ్లడం. ధవన్ గాయపడినప్పుడైనా మిడిలార్డర్ను బలోపేతం చేయకుండా అనుభవంలేని రిషబ్, మయాంక్ను తీసుకోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలే ఉన్నాయి. కార్తీక్, పంత్కు ఉపఖండం ఆవల ఒత్తిడిని అధిగమించే సత్తా లేదనేది సత్యం. సెమీస్లో ఇది స్పష్టమైంది.
ప్లాన్- బి లేకుంటే ఎలా ?
వరల్డ్కప్ లీగ్ దశలో టీమిండియాకు విజయాలు దక్కాయంటే కేవలం రోహిత్, కోహ్లీ, రాహుల్, బౌలర్ల ప్రతిభతోనే. కానీ దురదృష్టం కొద్ది సెమీస్లో టాప్–3 ఫెయిల్ కావడం ఏకంగా కప్నే దూరం చేసింది. ప్లాన్–ఎ సక్సెస్ అయినంతవరకు విరాట్సేనకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. దానిని దృష్టిలో పెట్టుకుని మేనేజ్మెంట్ ప్లాన్–బిని పూర్తిగా వదిలేసింది. ఇది లేకుండా వరల్డ్కప్లో దిగడం కొంప ముంచింది. ఫినిషర్లుగా ఉన్న ధోనీ, పాండ్యాకు మిడిల్లో సరైన సహకారం ఇచ్చే ఆటగాడే లేకపోవడం ఆందోళనలో పడేసింది. ఈ ఏడాది ఇంగ్లండ్ పిచ్లపై ఒక్క మ్యాచ్ ఆడిన అనుభవం లేకపోయినా కేవలం ప్రత్యామ్నాయ కీపర్గా తీసుకున్న కార్తీక్ పూర్తిగా తేలిపోయాడు.