- 105 నియోజకవర్గాలకు గానూ 86 చోట్ల మొదలైన పనులు
- రూ.1,144.85 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
- కార్పొరేట్ సంస్థలను తలదన్నేలా 30 ఎకరాల్లో మెగా క్యాంపస్లు
హైదరాబాద్, వెలుగు: పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నది. ఒకప్పుడు కులానికో హాస్టల్.. వర్గానికో స్కూల్ అన్నట్లుండగా.. ఆ వివక్షను తుడిచివేస్తూ, అందరూ కలిసి చదువుకునేలా సీఎం రేవంత్రెడ్డి ఈ స్కూళ్లకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 105 నియోజకవర్గాల్లో ఈ మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తుండగా, ఇప్పటికే మెజారిటీ చోట్ల పనులు పరుగులు పెడుతున్నాయి. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు విడివిడిగా ఉన్న రెసిడెన్షియల్ విద్యా విధానం పిల్లల్లో చిన్నతనం నుంచే వేర్పాటు భావనను కలిగిస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఈ అడ్డుగోడలను కూల్చేస్తూ ‘ఇంటిగ్రేటెడ్’ విధానాన్ని తెచ్చింది. ప్రతి నియోజకవర్గంలో బాయ్స్కు ఒకటి, బాలికలకు మరొకటి చొప్పున ఈ స్కూళ్లను ప్లాన్ చేశారు. ఫస్ట్ ఫేజ్లో భాగంగా105 నియోజకవర్గాలను ఎంపిక చేయగా, అందులో 86 స్కూళ్లకు సంబంధించి పనులు వివిధ దశల్లో ఉన్నాయి.ఇప్పటికే 78 పాఠశాలల టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు వేగంగా సాగుతుండగా, మిగిలిన చోట్ల స్థలాల కేటాయింపు, డీపీఆర్ తయారీ పనులు జరుగుతున్నాయి.
జిల్లాల వారీగా ఇదీ పురోగతి
ఆదిలాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో టెండర్లు ముగిసి పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ముధోల్, బోథ్, నిర్మల్లో టెండర్ల పరిశీలన జరుగుతోంది. శేరిలింగంపల్లిలో స్థల సేకరణ పూర్తి కాగా, చాంద్రాయణగుట్టలో చివరి దశకు చేరింది. సిర్పూర్, కామారెడ్డి, దుబ్బాకలో డీపీఆర్లు సిద్ధమవుతున్నాయి. మరోవైపు రెండో విడతలో భాగంగా కోరుట్ల, జనగామ, హుజూరాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, మహేశ్వరం, ఉప్పల్, కూకట్పల్లి సహా మరో 19 నియోజకవర్గాల్లో స్కూళ్ల ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేసి అనుమతి కోసం నివేదికలు పంపారు.
ఆధునిక ల్యాబ్లు.. లైబ్రరీలు..
గతంలో నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ల కంటే తక్కువ వ్యయంతోనే అత్యంత ఆధునిక వసతులు కల్పించేలా ప్రభుత్వం పారదర్శక అంచనాలను రూపొందించింది. ఒక్కో స్కూల్ను సుమారు 25 నుంచి 30 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా డిజిటల్ తరగతి గదులు, ఆధునిక సైన్స్ ల్యాబ్లు, లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నారు. ఒకే క్యాంపస్లో 2,650 మంది విద్యార్థులకు సరిపడేలా అత్యాధునిక డార్మెటరీలు, డైనింగ్ హాల్స్ను నిర్మిస్తున్నారు. దీంతో పాటు అంతర్జాతీయ స్థాయి క్రీడా మైదానాలు, ఇండోర్ గేమ్స్ సౌకర్యాలతో పాటు బోధన, బోధనేతర సిబ్బందికి అక్కడే నివాస సదుపాయం కల్పించనున్నారు.
నిధుల కొరత లేకుండా..
ఇంటిగ్రేటెడ్స్కూళ్లు వేగంగా పూర్తి కావడానికి నిధుల కొరత లేకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నది. ఇప్పటి వరకూ రూ. 1,144.85 కోట్ల నిధులను విడుదల చేసింది. దీంతో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా హక్కుతోపాటు కార్పొరేట్కు దీటుగా చదువులు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ యంగ్ ఇండియా స్కూళ్లు తెలంగాణ విద్యా చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
