- రూ.15 వేల కోట్లకుపైగా పెట్టుబడి
- సుమారు 116 ఎకరాల్లో ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ భారతదేశంలో తన అతిపెద్ద డేటా సెంటర్ను గురువారం హైదరాబాద్లో అధికారికంగా ప్రారంభించింది. ఏఐ మార్కెట్లో పోటీ పడేందుకు అదానీ గ్రూప్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సుమారు 116 ఎకరాల విస్తీర్ణంలో ఈ డేటా సెంటర్ల సముదాయం ఏర్పాటయింది. వీటికోసం రూ.15 వేల కోట్లకుపైగా పెట్టుబడి పెట్టామని తెలిపింది. ఇందులోని మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సెక్యూరిటీ, ఐటీ ఆపరేషన్స్, క్యాంపస్ మేనేజ్మెంట్ విభాగాలలో వందలాది మంది పనిచేస్తారు.
ఈ కొత్త సౌకర్యం ద్వారా భారతదేశంలో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ రీజియన్ల సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఇప్పటికే పుణె, చెన్నై, ముంబైలో ఈ సంస్థకు క్లౌడ్ సెంటర్లు ఉన్నాయి. దీని ద్వారా దేశంలోనే టాప్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడర్గా మైక్రోసాఫ్ట్ ఎదిగింది. ఇండియాలో దాదాపు రూ.1,95,221.5 కోట్ల పెట్టుబడికి కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. తమ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం అజూర్ గత రెండేళ్లుగా భారత్లో రెండంకెల వృద్ధి రేటును సాధిస్తోందని వెల్లడించింది. జియోతో కలిసి మైక్రోసాఫ్ట్ దేశంలో మరో రెండు డేటా సెంటర్లను కూడా నిర్వహిస్తోంది.
