కంగారుల తోక విరిచిన షమీ.. 6 రన్స్ తేడాతో భారత్ విక్టరీ

కంగారుల తోక విరిచిన షమీ.. 6 రన్స్ తేడాతో భారత్ విక్టరీ

ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. ఆతిథ్య జట్టుపై 6 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. 187 పరుగుల టార్గెట్ను ఛేదించే క్రమంలో ఆసీస్ 20 ఓవర్లలో 180 పరుగులకే కుప్పకూలింది.  

రాహుల్, సూర్య హాఫ్ సెంచరీలు..

ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 20 ఓవర్లలో 4 వికెట్లకు 186  పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 15 పరుగులే చేసి ఔటైనా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్  హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 33 బంతుల్లోనే 3 సిక్సులు, 6 ఫోర్లతో 57 పరుగులు సాధించాడు.  రోహిత్ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ 19 పరుగులతో పర్వాలేదు అనిపించాడు. అయితే భారీ స్కోరు మాత్రం సాధించలేక స్టార్క్ బౌలింగ్లో పెవిలియన్ కు చేరాడు. అనంతరం వచ్చిన పాండ్యా, దినేష్ కార్తీక్ ఇలా వచ్చి అలా వెళ్లారు. 

రెచ్చిపోయిన సూర్యకుమార్..

ఓ వైపు వికెట్లు పడుతున్నా సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ భారత్కు భారీ స్కోరును అందించాడు. ఇదే క్రమంలో 33 బంతుల్లో ఒక సిక్సు, 6 ఫోర్లతో 50 పరుగులు చేశాడు.  ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డ్సన్ నాలుగు వికెట్లు పడగొట్టగా స్టార్క్, మాక్స్వెల్, ఆష్టన్ అగర్ తలో ఓ వికెట్ దక్కించుకున్నారు. 

ఫించ్ ఒక్కడే..

ఆ తర్వాత 187 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 180 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు ఫించ్, మిచెల్ మార్ష్ ఇద్దరు తొలి వికెట్కు 64 పరుగులు జోడించారు. 35 పరుగులు చేసిన మార్ష్ను భువీ ఔట్ చేశాడు. ఆ తర్వాత 11 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ను చాహల్ పెవిలియన్ కు చేర్చాడు. ఈ దశలో కెప్టెన్ ఫించ్, మాక్స్వెల్ జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా ఫించ్ భారత బౌలర్లపై రెచ్చిపోయాడు. ఫోర్లు , సిక్సర్లతో అదరగొట్టాడు. ఇదే క్రమంలో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే వీరిద్దరి జోడిని భువనేశ్వర్ విడగొట్టాడు. మాక్స్ వెల్ను ఔట్ చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వరుసగా వికెట్లను కోల్పోయంది. చివర్లో బౌలింగ్ చేసిన షమీ మూడు వికెట్లను పడగొట్టి ఆసీస్ పరాజయంలో కీలక పాత్ర పోషించాడు.