
హైదరాబాద్లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఇంజినీర్ కి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు వచ్చిన వార్త కలకలం రేపుతోంది. దక్షిణ కొరియా నుండి తిరిగి వచ్చిన తర్వాత అతనికి ఈ లక్షణాలున్నాయని ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఆ టెక్కీని ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఆసుపత్రిలో చేర్చారు.
అతని వైద్య పరీక్షలు చేశామని, రిపోర్ట్ లు రావడానికి ఇంకా 24 నుండి 48 గంటలు పట్టవచ్చని అక్కడి డాక్టర్లు తెలిపినట్టు సమాచారం. ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉందని, జలుబుతో బాధపడుతున్నాడు తప్ప ఇతర ఏ లక్షణాలు కనిపించలేదని అక్కడి డాక్టర్లు చెప్పినట్టు సదరు వార్తా సంస్థ తెలిపింది.
అయితే.. మంగళవారం, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎ కె కె శ్రీనివాస్… రాష్ట్రంలో కరోనావైరస్ (కోవిడ్ -19) ప్రభావం లేదని, అలాంటి పరిస్థితి ఎదురైనా.. పరిష్కరించడానికి ఆరోగ్య యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని తెలిపారు.
ఇప్పటి వరకు భారతదేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 28 కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ తెలిపారు. ఇందులో 16 మంది ఇటాలియన్ టూరిస్టులని చెప్పారు.