
యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రైతుల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. యాదాద్రి జిల్లా, మండలంలోని వంగపల్లిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా పథకం కింద తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం గొప్ప విషయమని కొనియాడారు. కొందరు రైతులకు రుణమాఫీ కూడా కాలేదని తన దృష్టికి వచ్చిందని, ఆ సమస్యను కూడా పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
అంతకుముందు రైతు భరోసా సంబరాల్లో భాగంగా రైతువేదికలో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ లో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, ఎంపీడీవో నవీన్ కుమార్, మండల వ్యవసాయ అధికారి సుధారాణి, మండల స్పెషలాఫీసర్ సబిత, ఏఈవో శ్రీనివాస్, విలేజ్ సెక్రటరీ లావణ్య తదితరులు ఉన్నారు.