నేవీ, ఎయిర్ఫోర్స్ కోసం రెండు వెర్షన్లు
నేవీకి టీఈడీబీఎఫ్, ఎయిర్ఫోర్స్కు ఓఆర్సీఏ
మామూలు తేజస్తో పోలిస్తే మరింత పవర్ఫుల్
రెండు ఇంజన్లతో ఎక్కువ రేంజ్, ఎక్కువ స్పీడ్
వెపన్లు, సెన్సర్లు సహా అన్నీ దేశీవే
కేంద్రం డబ్బులిస్తే ఆరేళ్లలో నేవీకి తొలి విమానం
12 ఏళ్లలో అన్ని విమానాలూ సిద్ధం
ఒకప్పుడు రష్యా నుంచి మిగ్, సుఖోయ్లు. ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి రాఫెల్. ఎప్పుడూ మన విమాన సేనకు విదేశీ యుద్ధ విమానాలే బలంగా, అస్త్రాలుగా మారాయి. మరి, మనం సొంతంగా యుద్ధ విమానాలను తయారు చేసుకోలేమా? రాఫెల్కు దీటుగా పవర్ఫుల్ ఎయిర్క్రాఫ్ట్లకు రూపునివ్వలేమా? హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్– హాల్), ఏరోనాటికల్ డిజైన్ ఏజెన్సీ (ఏడీఏ)లు కలిసి ప్రొటోటైప్ ‘తేజస్’ యుద్ధ విమానాలను డిజైన్ చేశాయి. తేజస్ ఏంటి.. ఇప్పటికే ఉన్నాయి కదా అన్న అనుమానం వచ్చిందా? హాల్, ఏడీఏలు డిజైన్ చేసింది తేజస్కు అడ్వాన్స్డ్ మోడల్ విమానాలను. ప్రస్తుతం అవి డిజైన్ల వరకే పరిమితమయ్యాయి. తమ డిజైన్లు, వార్ఫేర్కు కేంద్రం ఓకే చెప్పి బడ్జెట్ ఇస్తే, 12 ఏళ్లలో వాటిని తయారు చేసిస్తామని హాల్ చెబుతోందని తెలుస్తోంది. ఇంతకీ ఏంటా విమానాలు.. వాటి కథేందో చూద్దాం!!
నేవీకి ఒక రకం.. ఎయిర్ఫోర్స్కు ఇంకో రకం
హాల్, ఏడీఏలు నేవీ, ఎయిర్ఫోర్స్ కోసం రెండు రకాల తేజస్ అడ్వాన్స్డ్ యుద్ధ విమానాలకు డిజైన్లు తయారు చేశాయి. నేవీ కోసం ట్విన్ ఇంజన్ డెక్ బేస్డ్ ఫైటర్ (టీఈడీబీఎఫ్), ఎయిర్ఫోర్స్ కోసం ఓమ్ని రోల్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఓఆర్సీఏ)కు డిజైన్ రెడీ చేశాయి. నేవీ యుద్ధ విమానాలతో పోలిస్తే ఎయిర్ఫోర్స్ కోసం తయారు చేసే రకం కొంచెం తక్కువ బరువుతో ఉంటుందని తెలుస్తోంది. దాదాపు ఓ టన్ను వరకు తక్కువుంటుందట. నేవీ వేరియంట్ అయితే, ఎయిర్క్రాఫ్ట్ కారియర్ డెక్పై దిగడం, టేకాఫ్ కావడానికి ల్యాండింగ్ గేర్ ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి టీఈడీబీఎఫ్ బరువు ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు, రాఫెల్ విమానాలకు పెడుతున్న ఖర్చు కన్నా తక్కువకే ఈ విమానాల తయారీ ఖర్చు ఉంటుందట. ఇండియా స్పెసిఫిక్ ఎన్హాన్స్మెంట్ ప్యాకేజీ కింద 36 రాఫెల్ విమానాలను రూ.12,780 కోట్లు పెట్టి కొంటున్న సంగతి తెలిసిందే. నేవీ వేరియంట్లో ఒక్కో విమానానికి రూ.538 కోట్ల దాకా ఖర్చవుతుందని దానిని డిజైన్ చేసినోళ్లు చెబుతున్నారు. ఎయిర్ఫోర్స్ వేరియంట్కు నేవీ వేరియంట్తో పోలిస్తే రూ.35 కోట్ల నుంచి రూ.71 కోట్లు తక్కువే అవుతుందంటున్నారు. కేంద్రం తమ ప్రాజెక్టుకు ఓకే చెప్పి నిధులు విడుదల చేస్తే ఆరేళ్లలో తొలి విమానాన్ని అందిస్తామంటున్నారు.
పరికరాలు, మిసైళ్లు అన్నీ దేశీనే
ఇటు టీఈడీబీఎఫ్, అటు ఓఆర్సీఏల్లో మొత్తం సొంతంగా తయారు చేసుకున్న అత్యాధునిక రక్షణ పరికరాలనే వాడుతున్నట్టు వాటి డిజైనర్లు చెబుతున్నారు. ఒకేసారి సముద్రం, నేలపైన టార్గెట్లను అత్యంత కచ్చితత్వంతో ట్రాక్ చేసే యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ రాడార్ (ఏఈఎస్ఏ)లను ఏర్పాటు చేస్తామంటున్నారు. ఏదైనా మిషన్ సందర్భంగా ముఖ్యమైన సెన్సర్ సమాచారాన్ని భద్రంగా చేరేవేసేందుకు మేడిన్ ఇండియా డేటా లింకులు, కమ్యూనికేషన్ సిస్టమ్లూ వాటిలో పెడతారట. అంతేగాకుండా ఇటీవలే టెస్ట్ చేసిన ‘అస్త్ర’ వంటి మేడిన్ ఇండియా లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్నూ వాటికి అమర్చొచ్చని చెబుతున్నారు.
750 విమానాలు కావాలి
2030 నుంచి 2050 మధ్య ఇండియాకు దాదాపు 750 దాకా యుద్ధ విమానాలు అవసరమవుతాయని చెబుతున్నారు. 2040 నాటికి ఇండియన్ ఎయిర్ఫోర్స్లో అత్యంత కీలకమైన సుఖోయ్ 30ఎంకేఐతో పాటు చాలా యుద్ధ విమానాలు రిటైర్ అయిపోతాయని, వాటికి రీప్లేస్మెంట్లు తప్పనిసరి అని చెబుతున్నారు. కాబట్టి ఆ దిశగా టీఈడీబీఎఫ్ కీలక యుద్ధ విమానంగా మారుతుందని ధీమాగా చెబుతున్నారు. టీఈడీబీఎఫ్, ఓఆర్సీఏతో పాటే స్టెల్త్ ఫైటర్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఏఎంసీఏ)లను సమాంతరంగా తయారు చేస్తామని చెబుతున్నారు. తేజస్తో పోలిస్తే ఆ మూడు రకాలు కొంచెం ఖర్చుతో కూడుకున్నవేనంటున్నారు. కేంద్రం నిధులు విడుదల చేస్తే ఏఎంసీఏని 2040 వరకల్లా తయారు చేసిస్తామని చెబుతున్నారు. రాఫెల్కు దీటుగా తేజస్ టీఈడీబీఎఫ్ అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని, సెన్సర్లు చాలా అడ్వాన్స్డ్గా పనిచేస్తాయని చెబుతున్నారు. మేడిన్ ఇండియాలో భాగంగా వీటిని తయారు చేస్తే దేశ ఏరోస్పేస్ పవర్కు కొత్త శక్తి వచ్చినట్టేనని అంటున్నారు.
మామూలు తేజస్ కన్నా పవర్ఫుల్
కొన్ని వారాల్లో మనం సొంతంగా తయారు చేసుకున్న లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఎల్ఏసీ) తేజస్ (హాల్ తయారు చేసింది) మన ఎయిర్క్రాఫ్ట్ కారియర్ ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై ల్యాండ్ కాబోతోంది. తొలిసారిగా నేవీలోకి అది చేరుతోంది. అయితే, అది అమెరికా తయారు చేసిన జనరల్ ఎలక్ట్రిక్ ఎఫ్404–జీఈ–ఐఎన్20 సింగిల్ ఇంజన్తోనే నడుస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే తేజస్ను మరింత పవర్ఫుల్గా తీర్చిదిద్దేందుకు రెండు జనరల్ ఎలక్ట్రిక్ ఎఫ్414 ఇంజన్లతో ట్విన్ ఇంజన్ డెక్ బేస్డ్ ఫైటర్ను డిజైన్ చేస్తున్నాయి హాల్, ఏడీఏలు. దాని వల్ల ఎక్కువ దూరం ప్రయాణించడంతో పాటు వెపన్స్ పేలోడ్ సామర్థ్యం కూడా పెరుగుతుందని చెబుతున్నారు. అంతేగాకుండా వేడి, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఎయిర్క్రాఫ్ట్ కారియర్పై సేఫ్గా దిగేలా, అక్కడి నుంచి మరింత సేఫ్గా టేకాఫ్ అయ్యేలా ఈ రెండు ఇంజన్లు చూస్తాయంటున్నారు.
సూపర్ స్పీడ్
బరువు, వేగం విషయంలోనూ తేజస్తో పోలిస్తే టీఈడీబీఎఫ్ అడ్వాన్స్డ్గానే ఉంటుందని డిజైనర్లు చెబుతున్నారు. తేజస్ మార్క్1 (13.5 టన్నులు), 2030 నాటికి ఎయిర్ఫోర్స్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న తేజస్ మార్క్2 (17.5 టన్నులు)తో పోలిస్తే టీఈడీబీఎఫ్ (23 టన్నులు) ఎక్కువ బరువు ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియన్ నేవీ ఆపరేట్ చేస్తున్న మిగ్29కే సైజంత ఉంటుందని అంటున్నారు. అంతేగాకుండా షిప్ డెక్కులపై స్పేస్ను సేవ్ చేసేలా టీఈడీబీఎఫ్ రెక్కలు మలుచుకుంటాయని, అది మరో స్పెషాలిటీ అని అంటున్నారు. మాక్1.6 స్పీడ్తో గంటకు దాదాపు 2 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందని చెబుతున్నారు.